క్రమశిక్షణకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ

Published: Saturday August 06, 2022
కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ బ్యూరో 05 ఆగస్టు ప్రజా పాలన : ప్రతి కాంగ్రెస్ కార్యకర్త క్రమశిక్షణ హద్దులను దాటరాదని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ హితోపలికారు. అధికార టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అవాకులు చవాకులు పేలి చులకన అవుతున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కొండ బాలకృష్ణారెడ్డి వేడుక వేదికలో వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏఐసీసీ మరియు టీపీసీసీ ఆదేశాల మేరకు నిత్యావసర సరుకుల ధరల నియంత్రణ, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు నిరుద్యోగం అగ్నిపత్ పంట నష్టపరిహారం వంటి విషయాలపై విఫలమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో తీవ్రమైన ఆర్థిక మాంద్యo ఏర్పడిందని విమర్శించారు. అడ్డగోలుగా పెరుగుతున్న ధరలను అదుపులో ఉంచలేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చతికిల పడుతున్నాయని ఘాటుగా స్పందించారు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ ల పై అక్రమంగా ఈడీ కేసులు నమోదు చేసి విచారణ చేయడం అవివేకమని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని ఏ కార్యకర్తను చిన్నచూపు చూడమని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కాలపరిమితి మూడు సంవత్సరాలు దాటిన ఒక్క అభివృద్ధి పనులు చేపట్టకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని తెలిపారు. ఎమ్మెల్యే ఆనందును బుడ్డోడు అనే సంస్కృతి మా వంశంలోనే లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే నా వయసు కన్నా చిన్న వ్యక్తి అయినా గౌరవంగానే సంబోధిస్తానని పేర్కొన్నారు. ఇద్దరు మాజీ మంత్రులను ఎన్నికల్లో ఓడించి ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పుకోవడం సరికాదని అన్నారు. ఇద్దరు మాజీ మంత్రులు హోరా హోరీగా పోటీ పడడం వలన డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యేగా గెల్పొందారని గుర్తు చేశారు. మహిళా జడ్పీ చైర్ పర్సన్ సునీత రెడ్డి పై అక్రమంగా దాడి చేయించడం అమానుషమని విమర్శించారు. ఎమ్మెల్యే ఆనంద్ తాను చెప్పదలుచుకున్న ప్రతి అంశాన్ని సోషల్ మీడియా వ్యక్తులచే లేనిపోని కల్పిత అసత్య ఆరోపణలతో వ్యక్తిగత దూషణలకు పాల్పడడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నాయకుడు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అని కూడా చూడకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో నేమోనని సందేహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆనంద్ టిఆర్ఎస్ కార్యకర్తలపై అమానుషంగా అమానవీయంగా అక్రమంగా కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేయడం సరికాదని హితవు పలికారు. ప్రజాసేవ చేయడానికి ప్రజలు మీకు అవకాశం ఇచ్చారని దానిని మీరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇకముందు కాంగ్రెస్ పార్టీని గానీ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ను గానీ విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ పిఎసిఎస్ మాజీ చైర్మన్ కిషన్ నాయక్ చేవెళ్ల పార్లమెంట్ మెంబర్షిప్ కోఆర్డినేటర్ చామల రఘుపతి రెడ్డి కమాల్ రెడ్డి ఎర్రవల్లి జాఫర్ అనంత్ రెడ్డి కాల్ కూడా నర్సింలు మాజీ జెడ్పిటిసి సాయిపాల్ రెడ్డి చాపల శ్రీనివాస్ ముదిరాజ్ తదితర కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.