కడెం ప్రాజెక్ట్ వద్ద హైటెన్షన్. .. గ్రామాలు ఖాళీ చేయించిన అధికారులు. ( ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా

Published: Thursday July 14, 2022
మంచిర్యాల  బ్యూరో, జూలై 13, ప్రజాపాలన:
 
 
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోత వర్షాలు కొనసాగుతున్నాయి.  దింతో జిల్లాలోని చెరువులు, వాగులు, వంకలు, నదులు నిండుకుండలా మారాయి. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో అన్ని ప్రాజెక్టుల గేట్లు తెరిచేశారు. అయితే భారీ వరదతో కొన్ని ప్రాజెక్టుల వద్ద హైఅలర్ట్ కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకి వరద ముప్పు కొనసాగుతోంది. వెల్లువగా వస్తున్న వరద కారణంగా ప్రాజెక్టు వద్ద అధికారులు చివరి ప్రమాద హెచ్చరిక జారీచేశారు. భారీగా వస్తున్న ఇన్ ఫ్లోతో ఎప్పుడు ఏం జరుగుతుందో నన్న భయాందోళనలో  కడెం ప్రాజెక్టు లోతట్టు గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు.  క్షణక్షణం ఉత్కంఠ నెలకొంది. 
 
*  రికార్డుస్థాయిలో వరద.. ప్రజల తరలింపు
 
డ్యామ్ గేట్లు పూర్తిగా ఎత్తినా గేట్ల పైనుంచి వరద వెళ్తోంది. దీంతో వరద మరింత పెరిగితే డ్యామ్ ఏ క్షణంలోనైనా తెగిపోవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో డ్యామ్ కింది ప్రాంతంలో ఉన్న 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కడెం ప్రాజెక్ట్ వద్దకు చేరుకుని పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు. ప్రాజెక్టుకు ప్రమాదకర స్థితిలో వరదనీరు వస్తుండటంతో పరిసర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టు వద్ద ఉన్న పరిస్థితులను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎప్పటికప్పుడు నివేదిస్తు న్నామని మంత్రి తెలిపారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు మంత్రి తెలిపారు.  కడెం ప్రాజెక్టుకు 1995లోనూ ఇలాంటి పరిస్థితే వచ్చింది. అప్పుడు కూడా ప్రాజెక్టుకు ఊహించని రీతిలో వరద రావడంతో అధికారుల హెచ్చరికలతో స్థానికులు కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు 4 లక్షల 97 వేల 413 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు మొత్తం 18 గేట్లను పూర్తిగా ఎత్తివేసిన అధికారులు 2, 99,047 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం ప్రమాదస్థాయిలో చేరింది. 
 
* సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం.
 
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతీ హోళికెరీ  ఎప్పటికప్పుడు పలు సూచనలు చేస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. కడెం ప్రాజెక్టు లోతట్టు ప్రాంతంలో ని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. దీంతో రెవిన్యూ, పోలీస్ , పంచాయతీ రాజ్ అధికారులు సమన్వయం తో ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఆయా గ్రామాల్లో సర్పంచ్ లు , ఉప సర్పంచ్ లు ప్రజలతో మమేకమై సహాయ క చర్యల్లో పాల్గొంటున్నారు. కడెం ప్రాజెక్టు కు ప్రమాదం తప్పిందని అందుతున్న సమాచారంతో ఆయకట్టు ప్రాంత రైతులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి మరో రెండు రోజులు వర్షాలు యధావిదిగా కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఎపుడు ఏంజరుగుతుందో అనె ఆందోళన నెలకొంది.