కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం

Published: Wednesday July 07, 2021
ధారూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ళ రఘువీరారెడ్డి
వికారాబాద్ జూలై 06 ప్రజాపాలన బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధారూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ళ రఘువీరారెడ్డి అన్నారు. మంగళవారం ధారూర్ మండల కేంద్రంలోని స్టార్ వేడుక వేదిక నుండి శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వరకు సుమారు 2వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలతో విజయ సంకల్ప్ పాదయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏక వ్యక్తి పూజ ప్రధానంగా మారిందని విమర్శించారు. సిఎం కెసిఆర్ ఒంటెత్తు పోకడ, నియంతృత్వ పాలనలో ప్రజలు విసిగి పోయారని దెప్పి పొడిచారు. ప్రగతి భవనం ప్రవేశం మంత్రులకు, ఎంపిలకు, ఎమ్మెల్యేలకు దిక్కులేదని ఎత్తిచూపారు. రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించనున్నదని వివరించారు. వికారాబాద్ జిల్లా కు చెందిన వ్యక్తి రాష్ట్ర పగ్గాలు చేపట్టిన సందర్భంగా ధారూర్ నుండి శ్రీ అనంత పద్మనాభ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతపద్మనాభ సాక్షిగా రేవంత్ రెడ్డి సిఎం కావడం ఖాయమన్నారు. మాజీమంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ మళ్ళీ మంత్రి కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నర్సింహ, డిసిసిపి అధ్యక్షుడు టి.రాంమోహన్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అరథ సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.