ప్రమాదకరంగా మారిన బ్రిడ్జిలు* కుంగిన దెందుకూరు బ్రిడ్జిసైడ్ వాళ్ళు విరిగిన మీనవోలు బ్రిడ్

Published: Tuesday October 11, 2022
గుంతల మయంగా బోనకల్ బ్రిడ్జి*

మధిర అక్టోబర్ ( ప్రజా పాలన ప్రతినిధి) మధిర నియోజకవర్గ పరిధిలోని ఉన్న అనేక బ్రిడ్జీలు ప్రమాదకరంగా మారాయి. దశాబ్దాల క్రితం నిర్మించిన బ్రిడ్జి లకు నేటి వరకు మరమ్మతులు చేపట్టకపోవడంతో కొన్ని బ్రిడ్జిపై గుంతలు ఏర్పడగా మరికొన్ని బ్రిడ్జిల రక్షణ గోడలు విరిగిపోయాయి. ఈ బ్రిడ్జిపై వాహనచోదకులు రాకపోకలు కొనసాగించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కొక్కసారి బ్రిడ్జిపై ఉన్న గుంతల్లో పడి మృత్యువాత గురైన సంఘటన కూడా అనేకం ఉన్నాయి. మధిర పట్టణంలోని కూతవేటు దూరంలో వైరా నదిపై రాయపట్నం బ్రిడ్జి నిర్మించారు. అదేవిధంగా బోనకల్ మండలంలో వైరా నదిపై నిర్మించిన కలకోట బ్రిడ్జితో పాటు బోనకల్ రైల్వే బ్రిడ్జి ఎర్రుపాలెం మండలం కట్టలేరు పై మీనవోలు వద్ద నిర్మించిన బ్రిడ్జి మధిర మండలం దెందుకూరు వద్ద నిర్మించిన ఆర్ఓబి బ్రిడ్జిలు శిథిలావస్థకు చేరాయి. అనేక సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జికి ఇప్పటివరకు ఎటువంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో బ్రిడ్జిపై స్లాబ్ లేచిపోయి ఇనుప చువ్వలు బయటపడ్డాయి. రాత్రి వేళలో ద్విచక్ర వాహన చోదకులు ఇనుప చువ్వలు తగిలి ప్రమాదానికి గురైన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ బ్రిడ్జిపై మరమ్మతులు చేపట్టాలని అనేకసార్లు ఆర్ అండ్ బి అధికారులు దృష్టికి పట్టణ ప్రజలు, రాజకీయ పార్టీ నేతలు తీసుకెళ్లినా అధికారుల్లో చలనం లేదు. మధిర మండలంలోని దెందుకూరు ఆర్ఓబిపై కూడా భారీ స్థాయిలో గుంతలు ఏర్పడ్డాయి. ప్రజలు నడిచేందుకు ఏర్పాటుచేసిన ప్లాట్ ఫారం సైతం కృంగిపోయింది. అంతేకాకుండా బ్రిడ్జికి ఇరుపక్కలు ఏర్పాటు చేసిన రక్షణ గోడలు సైతం విరిగిపోయాయి. బ్రిడ్జిపై ఉన్న గుంతల వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఒక వ్యక్తి మృతి చెందారు. దీంతో గ్రామ ప్రజలు, సర్పంచ్ వెంటనే చొరవ తీసుకుని బ్రిడ్జిపై తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. అదేవిధంగా ఎర్రుపాలెం మండలం మీనవోలు బ్రిడ్జికి ఉన్న ఇరువైపుల నిర్మించిన రక్షణ గోడలు విరిగిపోయాయి. ద్విచక్ర వాహనదారులు ఆదమరిస్తే నదిలో పడిపోవడం ఖాయమని ప్రజలు చర్చించుకుంటున్నారు. బోనకల్లు రైల్వే ఓవర్ బ్రిడ్జి పై అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. బ్రిడ్జిపై ఉన్న స్లాబ్ లేచిపోవడం బ్రిడ్జి సువ్వలు బయటపడటంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అని ఆ బ్రిడ్జిపై ప్రయాణం చేసే వాహనదారులు భయంతో ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా కనీసం బ్రిడ్జికి రంగులు వేయలేదు. బ్రిడ్జిపై పారిశుధ్య అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పటికైనా రోడ్ల భవనాల శాఖ అధికారులు స్పందించి మరింత ప్రాణ నష్టం జరగకముందే బ్రిడ్జిలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల ప్రజలు కోరుతున్నారు.