బాలుడి ప్రాణం తీసిన చర్చి గేట్

Published: Monday February 20, 2023

బోనకల్, ఫిబ్రవరి 19 ప్రజా పాలన ప్రతినిధి:ఓ బాలుడి ప్రాణం తీసిన చర్చి గేట్. అభం శుభం తెలియని ఆ చిన్నారి అద్దెకు ఉంటున్న ఇంటి పక్కనే గల చర్చి గేటు ఎక్కి మరో మిత్రుడుతో కలిసి ఆడుకుంటూ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రులు ప్రతిరోజు కుమారుడిని తమవెంటే తీసుకెళ్లేవారు. కానీ ఆరోజు పనులు లేకపోవడంతో తల్లిదండ్రులు ఇంటి వద్దనే ఉన్నారు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రమైన బోనకల్ గిరిజన కాలనీకి చెందిన బుక్య కిషోర్, రమన (నానికి) దంపతుల ఏకైక కుమారుడు మురళీకృష్ణ (7). మురళీకృష్ణ ఈనెల 17వ తేదీన తన మిత్రుడితో కలిసి ఇంటి పక్కనే గల చర్చికి ఏర్పాటుచేసిన రన్నింగ్ గేటు ఎక్కి ఆడుకుంటున్నాడు. అయితే ప్రమాదవశాత్తు ఆ గేటు ఒక్కసారిగా ఊడి మురళీకృష్ణ పై పడింది. దీంతో మురళీకృష్ణ తలకు బలమైన గాయాలు అయ్యాయి. వెంటనే తల్లిదండ్రులు బోనకల్లు లోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మంలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. మురళీకృష్ణ కు తలకు బలమైన గాయాలు అయ్యాయని వైద్యులు గుర్తించారు. దీంతో వైద్యులు తలకు కుట్లు వేసి వైద్యం చేశారు. అయితే తల స్కానింగ్ తీయగా తల సగభాగం పగిలిపోయి ప్రమాదకరంగా ఉంది. వైద్య చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం మృతి చెందాడు.