నాగేందర్ నోట బండి సంజయ్ మాట

Published: Friday September 24, 2021
అమీర్ పేట్, సెప్టెంబర్ 23, ప్రజాపాలన ప్రతినిధి : బండి సంజయ్ కి కృతజ్ఞతలు ఇదేదో బిజెపి నాయకుడు పలికిన మాట కాదు. అధికార పార్టీ టి ఆర్ ఎస్ ఖైరతాబాద్ ఎం ఎల్ ఏ దానం నాగేందర్ నోటి వెంట వచ్చిన మాట. ఇది దానం పార్టీ మారడానికి సంకేతమా? అని చర్చించుకుంటున్నారు ప్రజానీకం. సోమాజిగూడ డివిజన్ కార్యకర్తల సమావేశం స్థానిక జయా గార్డెన్ లో జరుగగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న దానం నాగేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు డివిజన్ లోని అన్ని కమిటీ లకు నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణను అన్నపూర్ణ కు మారుపేరుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని అన్నారు.కేటీఆర్ ఆలోచన మేర నూతనంగా కులాల వారీగా వృత్తుల వారీగా కమిటీలను నియమించినట్లు ఆయన తెలిపారు. దావోస్ సభకు కేటీఆర్ కు ఆహ్వానం రావడం తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు గర్వకారణం అన్నారు. కేటీఆర్ పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు చూస్తే గురివింద గింజ సామెత గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న తెరాస సీనియర్ నాయకుడు బండి రమేష్ కు కృతజ్ఞతలు తెలుపబోతు పొరపాటున బండి సంజయ్ కి కృతజ్ఞతలు అనడంతో నిర్ఘాంతపోవడం కార్యకర్తల వంతయ్యింది.తరువాత పొరపాటును సరిచేసుకుంటూ బండి సంజయ్ కూడా తెరాస లోకే వస్తారని తెలిపారు. దానం పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని విమర్శలు వస్తున్న సమయాన ఇలా బండి కి కృతజ్ఞతలు అని అనడం పొరపాటో లేక మనసులో మాటో అని కార్యకర్తలు చర్చించుకోవడం విశేషం.