దేశానికి విశేష సేవలందించిన సుందరయ్య జీవితం నేటి యువతకు ఆదర్శంగా నిలవాలి
Published: Friday May 20, 2022
సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు
బోనకల్, మే 19 ప్రజా పాలన ప్రతినిధి:
మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు ఉద్యమ నేత అమరజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 37వ వర్ధంతిని బోనకల్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం మహానేత వర్ధంతి సందర్భంగా బోనకల్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, బోనకల్ గ్రామ కార్యదర్శి తెల్లాకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ మహానేత సుందరయ్య దేశానికి చేసిన విశేష సేవల గురించి వివరించారు. ఆయన జీవితం నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని , భూస్వామ్య కుటుంబంలో పుట్టిన పేద వర్గాల కోసం తన భూమిని పేదలకు పంచిన చరిత్ర మహానేతకు ఉందని అన్నారు. అంటరానితనం కోసం తన గ్రామంలో ఇంటి దగ్గర సహబంతి భోజనాలు ఏర్పాటు చేసి కుల వివక్ష నిర్మూలన కోసం పోరాటం చేశారని, నాయకులతో అవసరం లేని సమాజాన్ని నిర్మించాలని, వ్యవసాయ కార్మికుల కోసం వ్యవసాయ కార్మిక సంఘం పెట్టి వ్యవసాయ కార్మికులకు కూలి రేట్లు పెంచాలని పోరాడిన నేత సుందరయ్య అని అన్నారు. పార్లమెంటు మెంబరుగా శాసనసభ సభ్యునిగా పార్లమెంటుకు అసెంబ్లీకి సైకిల్ మీద వెళ్ళిన చరిత్ర సుందరయ్య దే అని కొనియాడారు. తన జీవితం మొత్తం పేద ప్రజలకు అంకితం చేసిన మహనీయుడు సుందరయ్య అని అలాంటి మహానేత చరిత్ర నేటి యువత తెలుసుకుని రాజకీయాలలో కొనసాగాలని సుందరయ్య కలలు కన్నా ఎర్రజెండా రాజ్యం తీసుకురావాలని ఆయన కోరారు .ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి కంకణాల సౌభాగ్యం, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ భూక్యా జాలు, బిల్లా విశ్వనాథం, చన్నా లక్షా ద్రి, గద్దె రామారావు, వార్డు నెంబర్ ఉప్పర శ్రీను, గిరిజన సంఘం మండల అధ్యక్షులు భూక్యా శ్రీను, బొబ్బిలి పాటి రాజు, కెవిపిఎస్ మండల నాయకులు ఏసు పోగు బాబు, నార పోగు సైమన్, సిపిఎం పార్టీ సానుభూతిపరులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: