తాహాశీల్దార్ కార్యాలయం లో విఆర్ఎ హత్య.

Published: Tuesday March 15, 2022
మంచిర్యాల బ్యూరో, మార్చి14, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా కన్నెపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో దారుణం చోటుచేసు కుంది. తహసీల్దార్‌ కార్యాలయంలో రాత్రిపూట విధులు నిర్వహిస్తుండగా కొత్తపల్లి వీఆర్‌ఏ దుర్గం బాబు(55)ను దుండగులు కత్తితో గొంతు కోసి హత్య చేశారు. తాహాశీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. స్థానిక ప్రజలు తెలిసిన వివరాల ప్రకారం.. కొత్త పెల్లి గ్రామానికి చెందిన దుర్గం బాబు విఆర్ఎ గా పనిచేస్తున్నాడు. ఆదివారం కన్నెపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో రాత్రిపూట విధులకు హాజరయ్యారు. కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా దుండగులు అతని పై దాడిచేసి హత్య చేశారు. సోమవారం ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న దుర్గంబాబును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న కన్నెపెల్లి  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఐతే వ్యక్తిగత కక్షలతో వీఆర్‌ఏ హత్య జరిగిందా లేదా రెవెన్యూ అధికారుల మధ్య విబేధాలతో హత్య చోటుచేసుకుందా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు సమాచారం. అయితే కొత్తపల్లి గ్రామంలో ఓ వ్యక్తి గత కొన్ని రోజులుగా చంపేస్తామని బెదరిస్తున్నారని, అదే విషయంపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని దుర్గంబాబు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అతనే బాబును హత్య చేసి ఉంటాడని ఆరోపణలు చేస్తున్నారు.