గద్వాల్ ఎమ్మెల్యే పై కేసు నమోదు చేయాలి

Published: Thursday November 24, 2022

మధిర రూరల్ నవంబర్ 23 (ప్రజా పలన ప్రతినిధి) విధి నిర్వహణలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్, నాగర్ కర్నూల్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటరెడ్డిపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేసిన భౌతిక దాడి విషయంలో ఎమ్మెల్యే పై వెంటనే కేసు నమోదు చేయాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ నాగూర్ వలి మధిర మండల అధ్యక్షులు ఏ వినోద్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్ సి ఓ వెంకటరెడ్డి పై జరిగిన భౌతికదాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల వద్ద ఇచ్చిన నిరసన పిలుపుమేరకు మండలం లోని కృష్ణాపురం సమీపంలో ఉన్న గురుకుల పాఠశాల వద్ద యుటిఎఫ్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ నాయకుల మధ్య ఆధిపత్య పోరు ఉద్యోగుల పాలిట శాపంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల సమయాన్ని మార్చాలని, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు రావిరాల లక్ష్మణ్ రావు, భీమ్ శంకర్, స్వర్ణలత, శ్రీనివాస్, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ నసీమా బేగం, బోధనా సిబ్బంది స్వప్న, మాధవి, మధుమతి, కిరణ్మయి, విజయ తదితరులు పాల్గొన్నారు.