నాలుగు నియోజకవర్గాలు కైవసం చేసుకుంటాం * వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మె

Published: Friday February 03, 2023
వికారాబాద్ బ్యూరో 2 ఫిబ్రవరి ప్రజాపాలన : వికారాబాద్ జిల్లా పరిధిలోని వికారాబాద్, పరిగి, కొడంగల్, తాండూర్ నియోజకవర్గాలను బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ విశ్వాసం వ్యక్తం చేశారు.  గురువారం కొడంగల్ పట్టణంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ లో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ హాజరయ్యారు. ముందుగా కొడంగల్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గ్రామ, మండల స్థాయిలలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అందరు ఒకరినొకరు గౌరవించుకుంటూ  సమన్వయంతో పార్టీని పటిష్టం చేయాలన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. అనునిత్యం పార్టీ కోసం పనిచేయాలని హితవు పలికారు. అధిష్టానం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రతి కార్యకర్త తుచ తప్పకుండా పాటించాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు, దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషించే విధంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు,  పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.