ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బంధీగా నిర్వహించాలి

Published: Wednesday April 27, 2022
జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
మంచిర్యాల బ్యూరో, ఏప్రిల్ 26, ప్రజాపాలన : జిల్లాలో మే 6వ తేదీ నుండి జరుగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను సంబంధిత శాఖల సమన్వయంతో పకడ్బంధీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్తో కలిసి అధికారులతో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మే 6వ తేదీ నుండి 24వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 9 గం||ల నుండి మధ్యాహ్నం 12 గం||ల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలో పరీక్షల నిర్వహణ కోసం 31 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రథమ సంవత్సరంలో 6 వేల 627 మంది విద్యార్థులు జనరల్, 1 వేయి 313 మంది విద్యార్థులు ఒకేషనల్ పరీక్షలు వ్రాయనుండగా, ద్వితీయ సంవత్సరంలో 6 వేల మంది జనరల్, 1 వేయి 285 మంది ఒకేషనల్ పరీక్షలు వ్రాయనున్నారని తెలిపారు. జిల్లా పరీక్షల కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, 25 కేంద్రాలకు 1 బృందం చొప్పున ఫ్లయింగ్ స్వ్కాడ్, 15 కేంద్రాలకు 1 బృందం చొప్పున సిట్టింగ్ స్వ్కాడ్ను నియమించడం జరిగిందని తెలిపారు. పోలీసు శాఖ పరిధిలో గుర్తించిన భద్రత కేంద్రాలలో పరీక్షల సంబంధిత పత్రాలు, సామాగ్రి భద్రపర్చడం జరుగుతుందని, పరీక్షల సమయానికి ఆయా పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలు అందజేయడం జరుగుతుందని, పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని, పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లను ఉదయం 8 గం॥ల నుండి మధ్యాహ్నం 12 గం॥ల వరకు మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన ఇన్విజిలేటర్లు, సిబ్బందిని నియమించాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకునే విధంగా బస్సులు నడిపించాలని, పరీక్ష సమయంలో ఉదయం 8 గం||ల నుండి మధ్యాహ్నం 1 గం||ల వరకు పరీక్ష కేంద్రాలలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్య సిబ్బంది, ఓ.ఆర్. ఎస్. ప్యాకెట్లు, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని తెలిపారు. విద్యార్థులు పరీక్షలకు హాజరు నమోదు కోసం ఏర్పాటు చేసిన మొబైల్ యాప్లో వివరాలు వెంటనే నమోదు చేయాలని తెలిపారు. తరగతి గదులు, పరీక్ష కేంద్రాల ఆవరణ పరిశుభ్రంగా ఉండే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, త్రాగునీటిని అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శైలజ, జిల్లా వైద్యాధికారి సుబ్బారాయుడు, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.