గూడ అంజన్న యాదిలో మహా సభ పోస్టర్లు ఆవిష్కరణ

Published: Saturday March 04, 2023

జన్నారం, మార్చ్ 03, ప్రజాపాలన: బెల్లంపల్లి పట్టణంలోని రెండవ గ్రౌండ్ లో మార్చ్ 5 వ తేదీన  కవి, రచయిత, కామ్రేడ్ గూడ అంజన్న యాదిలో సీపీఐ పార్టీ ప్రజా సంఘం తెలంగాణ ప్రజానాట్యమండలి మంచిర్యాల జిల్లా వారి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఖలిండర్ అలీఖాన్ ఆ సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గూడ అంజన్న యాదిలో మార్చి 5న ఊరు మనదిరా... వాడ మనది రా అనే పోరుబాట నీరాజనం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వస్తున్న జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ, యుద్ద నౌక గద్దర్, కళాకారులు, వందేమాతరం శ్రీనివాస్, విప్లవా చిత్రాల హీరో ఆర్ నారాయణమూర్తి, మిట్టపల్లి సురేందర్, రాంబాబు, తెలు విజయ, జయరాజ్, కోదండ రామ్, మందకృష్ణ మాదిగ హాజరవుతున్నారని తెలిపారు. పాట ప్రజల్లో బ్రతికే వుందని, పాటలతో నాలుగు కోట్ల ప్రజలను ఏకం చేసి తెలంగాణా సాధించడం జరిగిందని, అలాంటి కళాకారుడు గూడ అంజన్న మరణం తీరని లోటని, కళాకారుడు అంజన్న యాదిలో జరిగే బహిరంగ సభలో ప్రముఖులు తెలంగాణలో జరుగుతున్న వివక్ష, అణిచివేత పై వివరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో  సిపిఐ జన్నారం  మండల కన్వీనర్ మామిడి విజయ్, జిల్లాసమితి సభ్యులు దేవి, పోచన్న, మేదరి దేవవరం, అంగన్వాడీ జిల్లా కార్యదర్శి తోకలు సరస్వతి, నాయకులు దాసరి తిరుపతి,  కేతిరెడ్డి, రమణా రెడ్డి, పోతు రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.