అధికారుల ఆదమరపు.. ప్రైవేటు వ్యక్తుల మేలుకొలుపు

Published: Saturday July 30, 2022
శేరిలింగంపల్లి- ప్రజా పాలన/ జూలై 22 :జిహెచ్ఎంసి అధికారులు మత్తు నిద్రలో ఉన్నారని, ఇష్టారాజ్యంగా అక్రమ కట్టడాలకు అడ్డుగా వచ్చాయని ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ రోడ్డును ధ్వంసం చేసారని రవి కుమార్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం చందానగర్ డివిజన్ సాయి నగర్ వాసుల పిలుపుమేరకు సమస్యలపై సందర్శించడం జరిగిందని రవి కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో కొందరు ప్రైవేటు వ్యక్తులు చట్టవిరుద్ధంగా అక్రమ కట్టడాలు నిర్మిస్తూ , ఇష్టారాజ్యంగా జిహెచ్ఎంసి అధికారుల పర్మిషన్ లేకుండా రోడ్లను తవ్వడం వలన వాటర్ పోవడానికి అవుట్లెట్ లేక పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ సెల్లార్ లోకి నీరు వచ్చి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ విషయంపై రవి కుమార్ యాదవ్ అధికారులతో మాట్లాడి ఈ చర్యకు పాల్పడిన ప్రైవేటు వ్యక్తుల పై చర్య తీసుకొని త్వరితగతిన ఈ రోడ్లను తిరిగి పునర్నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అలాగే కాలనీలో అనధికారికంగా నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్ తో కాలనీ వాసుల సమక్షంలో మాట్లాడి డ్రైనేజీ లైన్ ను తీసేసి, రోడ్లను యధావిధిగా 3 రోజులలో నిర్మించాలని మందలించారు. పనిచేయని పక్షంలో తనే స్వయంగా వచ్చి పనులను పూర్తి చేయిస్తానని కాలనీ వాసులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నవీన్, బాలరాజు, స్థానిక కాలనీ వాసులు, అపార్ట్మెంట్ వాసులు, నాగుల్ గౌడ్, నవతా రెడ్డి, కసిరెడ్డీ రఘునాథ్ రెడ్డి, రామిరెడ్డి, లక్ష్మి, లక్ష్మణ్ ముదిరాజ్, వినోద్ యాదవ్, గణేష్ ముదిరాజ్, రవి గౌడ్ , అశోక్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.