సమిష్టి కృషితో వ్యవసాయ మార్కెట్ ను అభివృద్ధి చేసుకుందాం..: కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్

Published: Tuesday July 20, 2021
మెట్ పల్లి, జూలై 19 (ప్రజాపాలన ప్రతినిధి) : సమిష్టి కృషితో వ్యవసాయ మార్కెట్ ను అభివృద్ధి చేసుకుందామని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. సోమవారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకమండలి సభ్యులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసే దుకాణ సముదాయాల వల్ల మార్కెట్ కు అదనపు ఆదాయం లభించనుందన్నారు. ఇటీవల మార్కెట్ పాలకమండలి సభ్యులు తీర్మానం చేశారని ఈమేరకు ఉన్నతాధికారులకు నిర్ణయం పంపినట్లు తెలిపారు. అందరి సహకారంతో అభివృద్ధి పనులు త్వరలోనే మొదలవుతాయని అన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జరుపుల భారతీ రాయల్ నాయక్, వైస్ చైర్మన్ పూదరి సుధాకర్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ రణవేని సుజాత సత్యనారాయణ, డీఎంఓ ప్రకాష్, డీఈఈ మునిందర్, కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్లు, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.