జంట హత్యలకు పాల్పడిన నిందితులు అరెస్ట్

Published: Wednesday June 30, 2021

మంచిర్యాల టౌన్,జూన్29,ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన తల్లి కూతురు జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సాక్ష్యం దొరకకుండా పకడ్బందీగా హత్యలకు పాల్పడిన నిందితులను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ నెల 18న పట్టణంలోని బృందావన్ కాలనీలో విజయలక్ష్మి, ఆమె కూతురు రవినాను దారుణంగా హత్య చేసిన అల్లుడు కాలేరు అరుణ్ కుమార్ తో పాటు గుంటూరు జిల్లాకు చెందిన జుజ్జవరపు రోశయ్య అలియాస్ బిట్టు, కృష్ణా జిల్లాకు చెందిన దండం సుబ్బారావు అనే కిరాయి హంతకులను అరెస్ట్ చేసినట్లు సిపి వెల్లడించారు. హత్యకు సంబంధించి నిందితులు వాడిన సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో డిసిపి డి. ఉదయ్ కుమార్ రెడ్డి, ఎసిపి అఖిల్ మహాజన్ పాల్గొన్నారు.