నీటి తొట్టిలో పడి బాలుడు మృతి శోక సముద్రంలో కుటుంబ సభ్యులు..

Published: Thursday January 20, 2022
పాలేరు జనవరి 19 ప్రజాపాలన ప్రతినిధి : ప్రమాదవశాత్తు నీటి సంపూలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన బుధవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని అనాసాగరం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొడ్డు సతీష్(చందు),రోజా దంపతులకు చందు అనే సంవత్సరంనర బాలుడు ఉన్నారు. బుధవారం తల్లి ఇంటి వద్దే ఉండగా తండ్రి పొలానికి వెళ్లారు. అయితే తమ కుమారుడు చందు ఇంటిముందు ఆడుకుంటుండగా తల్లి ఇంటి పనులు చేసుకుంటుంది. ఈ క్రమంలో బాబు ప్రమాదవశాత్తు ఇంటి ఆవరణలో ఉన్న నీటి సంపూలో పడ్డాడు. అయితే బాబు కనిపించకపోవడంతో  ఆందోళన చెందిన తల్లి బయటకు వచ్చి వెతికింది. అయిన కనిపించకపోవడంతో నీటి సంపూ వద్ద చూడగా చందు అందులో పైకి తేలి కనిపించాడు. దీంతో ఆమె కేకలు వేయగా చుట్టు పక్కల వారు వచ్చి చందుని బయటికి తీశారు. అయితే అప్పటికే బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో హుటాహుటిన నేలకొండపల్లి లోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు పరీక్షించి బాలుడు అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు మృతి చెందడం వారిని తీవ్రంగా కలిచి వేసింది. బాలుడు మృతితో అనాసాగరంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న నేలకొండపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.