వీర తెలంగాణ పోరాట ప్రతీక మల్లు స్వరాజ్యం
Published: Monday March 21, 2022
మంచిర్యాల టౌన్, మార్చి 20, ప్రజాపాలన: వీర తెలంగాణ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం అందించిన స్ఫూర్తితో తెలంగాణ ప్రజలు తమ సమస్యల సాధన కోసం మడమ తిప్పని పోరాటం కొనసాగించాలని వివిధ సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఆదివారం రోజున మంచిర్యాల లో జరిగిన మల్లు స్వరాజ్యం సంస్మరణ సభ లో ఆయా ప్రజా సంఘాల నాయకులు పాల్గొని నివాళి అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ. 91 ఏళ్ల నిండు జీవితం గడిపిన మల్లు స్వరాజ్యం అందులో 80 ఏళ్లు తెలంగాణా ప్రజల ప్రయోజనాల రక్షణ కోసం నిలబడ్డారని వారు పేర్కొన్నారు. కార్మిక కర్షక హక్కుల కోసం చేసిన పోరాటంలో.. బ్రిటిష్ వారితోనూ, నిజాంరాజుతోనూ, నిరంకుశ దొరలతోనూ పోరాడిన చరిత్ర ఆమెదని వారు పేర్కొన్నారు. రాచరికపు విధానాలపై ప్రజల తరపున పోరాడిన సమ్మక్క-సారక్కల పోరాట వారసత్వాన్ని మల్లు స్వరాజ్యం కొనసాగించారని వారు పేర్కొన్నారు. నేడు సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్న మత రాజకీయాలను ప్రజలు ఐక్యంగా ఎలా ఎదుర్కోవాలో నేర్పిన పోరాట చరిత్ర వీర తెలంగాణ పోరాటానిదని. ఆ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన మల్లు స్వరాజ్యం జీవిత చరిత్రను భావితరాలకు అందించాలని కోరారు. దొరల కుటుంబంలో పుట్టినా. స్వయంగా భూస్వామ్య విధానాలను ఎదిరించి ప్రజల పక్షం వహించిన త్యాగచరిత ఆమెదని వారు తెలిపారు. మల్లు స్వరాజ్యం అందించిన పోరాట స్ఫూర్తిని వృథా పోనీయమని, ఆమె వారసత్వాన్ని కొనసాగిస్తామని ఆయా సంఘాల నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఉద్యోగ సంఘాల సమన్వయ సమితి జిల్లా కన్వినర్ రంగు రాజేశం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు గోమాస ప్రకాష్, అజిజ్, గోపి, బుచ్చన్న, మున్సిపల్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసార్ల రాజలింగు, మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా అధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: