యాసంగి వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలి

Published: Tuesday April 12, 2022
టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 11 ఏప్రిల్ ప్రజాపాలన : రైతు సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బంగారు తెలంగాణకు రైతు వెన్నెముకగా నిలుస్తాడని పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో రైతు దీక్షలో భాగంగా తెలంగాణ రాష్ట్రం యాసంగి వడ్లు కొనుగోలు చేయాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ కేంద్రం మెడలు వంచి వడ్లు కొనుగోలు చేసేలా కృషి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. సిఎం కేసీఆర్ పిలుపు మేరకు ఢిల్లీలో ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి తెరాస పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వికారాబాద్, తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్స్ మంజుల రమేష్, స్వప్న పరిమల్, ఏఎంసి ఛైర్మెన్లు తదితరులు పాల్గొన్నారు.