ఆసరాతో వయోవృద్ధులకు కొండంత భరోసా

Published: Saturday September 03, 2022
పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 02 సెప్టెంబర్ ప్రజా పాలన : ఆసరా పింఛన్లతో వయోవృద్ధులకు కొండంత ఆర్థిక భరోసా వస్తుందని టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి అన్నారు. వృద్ధాప్యంలో కూడా ఎవరికి డబ్బుల కొరకు చాచకుండా ఉండేందుకే సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్లు అందజేస్తున్నారని స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు చిట్యాల అనంతరెడ్డి లంకా పుష్పలతా లక్ష్మీకాంత్ రెడ్డి మేక పావని ఏఎంసీ వైస్ చైర్మన్ మేక చంద్రశేఖర్ రెడ్డి కృష్ణారెడ్డి గోపాల్ సమక్షంలో లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ ల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆసరా పింఛన్లతో కుటుంబ సభ్యులతో సంతోషంగా బ్రతికేందుకే ఆసరా పింఛన్ డబ్బులు అందజేస్తున్నారని గుర్తు చేశారు. వచ్చిన డబ్బులను వ్యసనాలకు వాడుకోకుండా మీ వ్యక్తిగత అవసరాలు తీర్చుకునేందుకు కుటుంబానికి సహాయం చేయాలని హితువు పలికారు. మీకంటూ ఆర్థిక స్వావలంబన చేకూరాలంటే మీ దగ్గర డబ్బు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ధనం మూలం ఇదం జగత్ అనే నానుడిని పెద్దలు ఊరికే చెప్పలేదని గుర్తు చేశారు. వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు తమ దగ్గర డబ్బులు ఉంటే ఎవరికి ఆశపడరని వివరించారు.