వరికి బదులు ఇతర పంటలు పండించాలి : జిల్లా కలెక్టర్ నిఖిల

Published: Monday December 13, 2021
వికారాబాద్ బ్యూరో 12 డిసెంబర్ ప్రజాపాలన : యాసంగి సీజన్లో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు పండించుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల రైతులను కోరారు. ఆదివారం పూడూర్ మండలంలోని పిఏసిఎస్ ద్వారా నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు సక్రమంగా నిర్వహించడం జరుగుతుందని, రైతులు సంతోషంగా ఉన్నారని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్బంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమంలో పాల్గొని జిల్లా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ, ఈ యాసంగి సీజన్ లో రైతులు ఉత్పత్తి చేసిన వరి ధాన్యాన్ని భారత ప్రభుత్వం ఎఫ్.సి.ఐ ద్వారా కొనడం లేదని అన్నారు. అందువల్ల యాసంగి సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయుటకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని తెలిపారు. వరి పంటలు వేసి రైతులు నష్టపోవద్దని తెలిపారు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకొని లాభం పొందాలన్నారు. ఎక్కువ కాలం వరి పండిస్తే భూమి సారం కోల్పోతుందని, అరుతడి పంటలు పండిస్తే భూసారాన్ని రక్షించుకోవచన్నారు. తక్కువ నీటితో ఎక్కువ పంట సాగు చేసి అధిక లాభాలు పొందవచ్చాన్నారు. ఈ సందర్బంగా వ్యవసాయ శాఖ అధికారులతో రైతులకు ప్రత్యామ్నాయ అరుతడి పంటలపై సూచనలు, సలహాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేశ్వర్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ విమల, మండలవ్యవసాయ అధికారి తదితరులు పాల్గొన్నారు.