అంతిమ సమయంలో మేము ఉంటాం

Published: Thursday May 06, 2021
కరోనా మృతుడికి మేము సైతం టీమ్ అంతక్రియలు
మల్లాపూర్, ఏప్రిల్ 05 (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా కన్నా సాటి మనుషుల తీరే వారిని కాల్చుకు తింటోంది. ఇక కరోనాతో చచ్చిపోయినవారి పట్ల సొంత బంధువులే విముఖత చూపడం వంటి దారుణాలు కూడా చూస్తున్నాం. దిక్కులేని చావు చచ్చినంత పని అవుతోంది. దీంతో చాలామంది కరోనా చావు రావొద్దని కోరుకుంటున్నారు. సాధారణ జబ్బులతో మృతిచెందిన వారిని సైతం కడదాకా మోసుకెళ్లేందుకు ‘ఆ నలుగురు’ దొరకని ‘కరోనా’ కాలమిది. ఇలాంటి పరిస్థితుల్లో మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామంలో బుధవారం కరోనా సోకిన వ్యక్తి మృతి చెందారు. మృతుడి అంతక్రియలకు ఎవరు ముందుకు రాకపోవడంతో మేము సైతం అంటూ  మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన పెంబి మహేందర్, గడ్డం నవీన్ రెడ్డి, అలిశెట్టి గంగాధర్, నేవురి శ్రీధర్ యువకులు ముందుకు వచ్చి కరోనా నిబంధనలు పాటిస్తూ పిపిఈ కిట్ ధరించి సాంప్రదాయ బద్దంగా కరోనా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. వీరి సేవలకు గాను గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. పరిసర ప్రాంతాల్లో కరోనాతో మరణిస్తే మేము సైతం టీమ్ కు సమాచారాన్ని అందిస్తే మేము ముందుండి దహన సంస్కారాలు నిర్వహిస్తామని ఈ నలుగురు యువకులు సూచిస్తున్నారు.