న్యాయస్థానాలను ఆశ్రయిస్తే అంతం చేస్తారా?: కసిరెడ్డి భాస్కరరెడ్డి

Published: Saturday February 20, 2021

శేరిలింగంపల్లి, ప్రజాపాలన : హైకోర్టు న్యాయవాదుల జంటను నడి రోడ్డు పై కిరాతకంగా హత్య చేయడం చూస్తే, తెలంగాణలో శాంతి భద్రతలు అదుపుదప్పాయని, భూమాఫియా రాష్ట్రంలో రాజ్యమేలుతుందని బిజెపి రాష్ట్ర నేత, 'జనం కోసం' అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ మొన్న జరిగిన న్యాయవాది దంపతుల హత్య సంఘటన రాష్ట్రంలో భయోత్పాతాన్ని సృష్టించిందని అంటూ, ఈ హత్యలపై హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరుపాలని ఆయన డిమాండ్ చేశారు. ఖమ్మంలో రామారావు ఇప్పుడు ఈ జంట హత్యలు పరిస్థితి భయానకంగా మార్చిందని, అధికార పార్టీ నాయకులు పోలీసుల సహకారంతో కేసుల పేరిట భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు. ప్రశ్నించే, పోరాడే గొంతులను శాశ్వతంగా మూపించి వేస్తున్నారనీ, అక్రమ కేసులతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పోలీసులను ప్రశ్నించేవారిపై ఉసిగొల్పుతున్నారని కసిరెడ్డి భాస్కరరెడ్డి తీవ్రంగా విమర్శించారు. సామాజిక ఉద్యమకారులకు అత్యున్నత న్యాయస్థానాలు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.