వికారాబాద్ కు రింగ్ రోడ్డు మంజూరు చేయాలి

Published: Saturday October 02, 2021
వికారాబాద్ బ్యూరో 01 అక్టోబర్ ప్రజాపాలన : జిల్లా కేంద్రానికి రింగ్ రోడ్డు మంజూరు చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కోరారు. శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ద్వారా రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తెచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దయవలన వికారాబాద్ జిల్లా ఏర్పడిందని గుర్తు చేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రం ఏర్పడి నందున రాకపోకలు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తపరిచారు. గతంలో వికారాబాద్ కు మంజూరైన రింగ్ రోడ్డు ఇతర నియోజకవర్గానికి తరలించినట్లు సమాచారం వస్తున్నదని అనుమానం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రం ఏర్పడి నందున వికారాబాదుకే ఒక రింగ్ రోడ్డును మంజూరు చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తెచ్చారు. మంత్రి స్పందిస్తూ వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కోరిన అంశాన్ని నోట్ చేసుకున్నామని సభా ముఖంగా తెలిపారు.