యాసంగిలో వరి పంట సాగు రద్దు
Published: Wednesday October 27, 2021
హైదరాబాద్ ప్రజాపాలన ప్రతినిధి: యాసంగి లో సాగు చేయవలసిన పంటలు మరియు విస్తీర్ణం మొదలగు అంశాలపై వివిధ జిల్లాల్లో ఆయా జిల్లాల కలెక్టర్ లు వ్యవసాయ అధికారులు మరియు ప్రైవేట్ విత్తనాలను అమ్మే దుకాణం డీలర్లతో సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల సారాంశం ఏమిటంటే యాసంగిలో వరి మరియు మొక్క జొన్న పంటలను సాగు చేయవద్దని సూచించారు. ఇటీవల జరిగిన కలెక్టర్ ల టెలికాన్ఫరెన్స్ లో రాష్ట్ర ముఖ్య మంత్రి యాసంగిలో వరి మరియు మొక్క జొన్న పంటలను సాగు చేయవద్దని తెలిపిన విషయాన్ని కూలంకషంగా వివరించారు. ముఖ్యంగా ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా వారు యాసంగిలో సాగు చేసే వరి మరియు మొక్క జొన్న పంట ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. అందుచేత యాసంగిలో వరి మరియు మొక్క జొన్న పంటలను సాగు చేయవద్దని రైతులకు తెలియజేయాల్సినదిగా సూచించారు. అంతే కాకుండా యాసంగి మొక్క జొన్న పంట ఉత్పత్తులను కూడా కొనుగోలు చేయరని తెలియజేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు వ్యవసాయ దారులు సహకరించాలని ఇతర పంటలను యాసంగిలో సాగు చేయవలసినదిగా సూచించారు. ఒకవేళ రైతులు ఈ సూచనలను పాటించకుండా వరి మరియు మొక్క జొన్న పంటలను యాసంగిలో సాగు చేసినట్లైతే ఆ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. వరి మరియు మొక్క జొన్న పంటలు కాకుండా ప్రత్యామ్నాయ పంటలను యాసంగిలో సాగు చేసుకోవాలని సూచించారు. ఆరుతడి పంటలైన వేరుసెనగ ఆముదం పెసర మినుము పొద్దు తిరుగుడు జొన్న శనగ ఆవాలు కుసుమ ఉలవలు మరియు నువ్వులు మొదలగు ఆరు తడి పంటలను యాసంగిలో సాగు చేసుకోవాలని రైతులకు సలహాలు సూచనలు ఇవ్వాలని వ్యవసాయ అధికారులకు మరియు ప్రైవేట్ విత్తన డీలర్లకు సూచించారు.
Share this on your social network: