రావిర్యాల లో 18న జరిగే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను విజయవంతం చే యలని పిలుపునిచ్చారు : టిపి
Published: Tuesday August 17, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 16, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం గడ్డ మీద దళిత సోదరులకు కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటానని టీపీసీసీ కార్యదర్శి దండెం రామ్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఇబ్రహీంపట్నం నుండి మహేశ్వరం మండలం రావిర్యాల సమీపంలో ఒక ప్రైవేటు స్థలంలో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాలమేరకు ఇబ్రహీంపట్నం రావిర్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత, గిరిజన దండోరా మోగించి తీరుతామని స్పష్టం చేశారు. టిఆర్ఎస్ పార్టీ దళితులను ఎంతగానో మోసం చేసిందని, అలా కాకుండా దళితుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ పుట్టుక నుంచి దళితులు, బడుగు, బలహీన వర్గాలకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందని, నాటి రాజ్యంగ రూపకర్త అంబేద్కర్ దగ్గర నుంచి నేటి వరకు వెనుకబడిన వర్గాలకు చెందిన వారిని కీలక పదవుల్లో ఉంచినట్టు తెలిపారు. దళితుడికి రాష్ట్రపతి పదవి ఇచ్చిన ఘనత లోక్సభ స్పీకర్గా మీరాకుమార్ను చేసిన ఘనత, రిజర్వేషన్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ఘనతేనని దండెం రాం రెడ్డి గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలను విజయవంతం చేసేందుకు ఇప్పటికే కార్యాచరణ రూపొందించడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా క్షేత్రస్థాయి పార్టీకి చెందిన నాయకులు స్థానిక నేతలతో సమన్వయం జరిగిందన్నారు. మహేశ్వరం మండలం రావిర్యాలలో ఈనెల 18న జరిగే దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా సభకు కార్యకర్తలు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని దండెం రామ్ రెడ్డి పిలుపునిచ్చారు.
Share this on your social network: