ప్రతి విద్యార్థి లక్షం మేరకు ప్రగతి సాధన చేపట్టాలి

Published: Wednesday December 14, 2022
జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ 
 
 
బోనకల్ ,డిసెంబర్ 13 ప్రజా పాలన ప్రతినిధి: విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేందుకు తొలిమెట్టు కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం బోనకల్ రైతు వేదికలో మండల విద్యాధికారులు, తొలి మెట్టు కార్యక్రమంలో భాగంగా నోడల్ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో తొలి మెట్టు కార్యక్రమంపై కలెక్టర్ మధిర నియోజకవర్గ స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు కనీస అభ్యాసన సామర్ధ్యాలతో పాటు తరగతికి సంబంధించిన అభ్యాసన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని అన్నారు. ప్రాథమిక స్థాయి పిల్లలు, అక్షరాలను గుర్తించడం, పదాలు చదవడం, బేసిక్ మ్యాథ్స్ పై పట్టు సాధించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ప్రతి ఒక పిల్లవాడు చక్కగా చదువుకోవాలి, రాయాలి అదేవిధంగా బేసిక్ మ్యాథ్స్ తెలిసేలా ఈ కార్యాచరణ చేయాలన్నారు. చదువులో వెనుకబడి ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రాథమిక అభ్యసన వైపు తీసుకువెళ్లాలని కలెక్టర్ సూచించారు. స్వల్పకాలిక లక్ష్యాలను ఏర్పరచుకొని గత నవంబర్ మాసం వరకు నిర్దేశించిన లక్ష్య సాధన, సాధనకు చేపట్టిన చర్యల గురించి ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితర ఇన్ పుట్ లన్ని ఉన్నట్లు ఫలితం రావాలని ఆయన అన్నారు. రెగ్యులర్ తరగతులతోనే తొలిమెట్టు కార్యక్రమ అమలు చేయాలన్నారు. ప్రధానోపాధ్యాయులు కార్యోన్ముఖులు అయితే సాధన ఏమాత్రం కష్టం కాదని ఆయన తెలిపారు. ఈ నెల 20 లోగా తరగతిలోని ప్రతి విద్యార్థి లక్ష్యం మేరకు ప్రగతి సాధనకు చర్యలు చేపట్టాలన్నారు.  
        ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి ఎస్. సత్యనారాయణ, మండల విద్యాధికారులు వై. ప్రభాకర్, ఎం. శ్యామ్ సన్, రామాచారి, ఎస్ఓ రామకృష్ణ, ఏఎంఓ రవికుమార్, తొలి మెట్టు నోడల్ అధికారులు, మధిర నియోజకవర్గంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.