ప్రతి జిపిలో 30 మందికి తగ్గకుండా ఉపాధి హామీ కూలీలను వినియోగించాలి : జిల్లా కలెక్టర్ నిఖిల

Published: Wednesday October 06, 2021
వికారాబాద్ బ్యూ 05 అక్టోబర్ ప్రజాపాలన : ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకు కనీసం 30 మందికి తగ్గకుండ NREGS జాబ్ కార్డు గల కూలీలను పెట్టి అభివృద్ధి పనులను చేపట్టాలని, కూలీలకు సంబంధించిన డబ్బులు ఎప్పటికప్పుడు FTO అప్లోడ్ చేసి చెల్లించే ఏర్పాట్లు చేయాలని నిర్లక్ష్యం వహిస్తే PR యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తప్పవని గ్రామ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్ లకు జిల్లా కలెక్టర్ నిఖిల హెచ్చరించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుండి ఎంపీడీఓ లు, ఎంపీవో లు, ఏపిఓ లు, గ్రామ కార్యదర్శులతో గ్రామంలో చేపట్టిన ప్రభుత్వ అభివృద్ధి పనులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ కార్యదర్శులు అందరు స్థానికంగా ఉండాలని, ప్రతి రోజు ఉదయం 6:00 గంటల నుండి పారిశుధ్యం, పరిశుభ్రత పనులను చేయించాలన్నారు. ఉదయం చేపట్టిన పనులన్నీ క్షేత్రస్తాయిలో గ్రామ కార్యదర్శులు పని చేయిస్తున్నట్లు కలెక్టర్ లాగిన్ లో స్క్రీన్ షాట్స్ పెట్టాలన్నారు. ప్రతి రోజు గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డ్ ల వద్ద పనులను పరిశీలించాలని, ఉపాధి హామీ కూలీలు చేపట్టిన పనులను పరిశీలించాలని సూచించారు.  కూలీలకు ఒక రోజు ముందే సమావేశపరిచి మరుసటి రోజు చేయాల్సిన పనులను తెలియపర్చాలన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో కూర్చొని పెండింగ్ పనులను, నిర్వహించాల్సిన (32) రిజిస్టర్ లను పూర్తి చేసి ఉంచాలన్నారు. వచ్చే సంవత్సరం లక్ష్యం మేరకు హరితహారం కొరకు అవసరమైన మొక్కలు పెంచాలన్నారు. ఒక్క బ్యాగ్ కూడా ఖాళీగా కనబడకూడదని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నర్సరీలలో మిగిలివున్న మొక్కలను వెంటనే నాటి పూర్తి చేయాలన్నారు. రోడ్లకు ఇరువైపుల అవెన్యూ ప్లాంటేషన్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు, నర్సరీలలో పనిచేసే వాచర్ లకు సంబందించిన చెల్లింపులు ఎప్పటికప్పుడు జరగాలన్నారు. పల్లె ప్రకృతి వనాలు, మినీ పల్లె ప్రకృతి వనాల పనులలో పురోగతి కన్పించాలని, బోర్డులు, ఫెన్సింగ్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించినపుడు పనులలో తేడాలు కనిపిస్తే PR చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. అన్ని గ్రామ పంచాయతీలలో వైకుంఠదామల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, ఇప్పటికే పూర్తి అయిన పనులకు సంబందించిన చెల్లింపులకు FTO లు అప్లోడ్ చేయాలన్నారు. వారం రోజులలో పెండింగ్ లో ఉన్న చెల్లింపుల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వైకుంఠ దామాలకు సంబందించిన సర్పంచుల డబ్బులు, ఉపాధి హామీ కూలీలు, నర్సరీలలో పనిచేసే వాచర్ ల డబ్బులు వెంటనే చెలించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీడీఓ లు, ఎంపీవో లు, క్షేత్ర స్థాయిలో ప్రతిరోజు పర్యటించి పనులను పరిశీలించాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన నవాబుపేట మండలం, మందన్ పల్లి గ్రామ కార్యదర్శిని జిల్లా కలెక్టర్ వెంటనే సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, డిఆర్ డిఓ కృష్ణన్, ఎంపీడీఓ లు, ఎంపీవో లు, గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.