ప్రైవేటు విద్యా సంస్థలలో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం రాయితీ

Published: Thursday September 08, 2022
రూ.30 వేల ఫీజు దాటితే  80% రాయితీ కల్పించాలి
- ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాన్ని ఆదేశించిన జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవి
- ఫలించిన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాయకుల కృషి
వికారాబాద్ బ్యూరో 07 సెప్టెంబర్ ప్రజాపాలన : ప్రైవేటు విద్యాసంస్థలలో జర్నలిస్టుల పిల్లలకు ట్యూషన్ ఫీజులో50 శాతం రాయితీ కల్పించాలని జిల్లా విద్యాధికారిణి రేణుకా దేవి ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాన్ని ఆదేశించారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంతో పాటు టీయూడబ్ల్యూజే (ఐజేయు) నాయకులు, జర్నలిస్టు ప్రతినిధులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి పిల్లలకు ఉచిత విద్య పై చర్చించారు. సమావేశాన్ని ఉద్దేశించి డిఇఓ మాట్లాడుతూ, అధిక ఫీజులు వసూలు చేసి విద్యార్థుల తల్లిదండ్రులపై భారం మోపరాదని యాజమాన్యాన్ని ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థలలో 50 శాతం రాయితీ కల్పించాలని సూచించారు. యూనియన్ నాయకులు కల్పించుకొని పూర్తి ఉచితంగా విద్యా సంస్థలలో అవకాశం కల్పించాలని కోరగా.. డి ఈ ఓ కల్పించుకొని రూ.30 వేల కంటే ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్న విద్యాసంస్థలలో 80 శాతం రాయితీ కల్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా యాజమాన్యాలు గతంలోనూ జర్నలిస్టులకు రాయితీ ఇచ్చామని  కరొనా మూలంగా కొంతవరకు నష్టపోయామని అయినా గుర్తింపు కలిగిన జర్నలిస్టు పిల్లలందరికీ తమ పాఠశాలలో రాయితీ కల్పిస్తామని హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస చారి, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీధర్, ఉపాధ్యక్షుడు వెంకటరమణ, నాయకులు ఆనంద్, గోపాల్, చుక్కయ్య, రాకేష్, నాగిరెడ్డి, లతోపాటు వికారాబాద్ పట్టణ ప్రైవేట్ విద్యా సంస్థల అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, సెక్రటరీ బస్వరాజ్, జిల్లా కోశాధికారి శేఖర్, స్టేట్ కోర్ కమిటీ మెంబర్ నాగయ్య, జిల్లా జాయింట్ సెక్రెటరీ నరేష్ (కొడంగల్), తాండూరు పట్టణ ప్రైవేట్ విద్యాసంస్థల అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, సెక్రటరీ ప్రశాంత్, కోశాధికారి ప్రవీణ్, రవీందర్, సంకల్ప విద్యా పీఠం కరస్పాండెంట్ ధన శెట్టి, భృంగి పాఠశాల కరస్పాండెంట్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.