జనవరి 18 నుండి కంటి వెలుగు ప్రారంభం

Published: Wednesday December 07, 2022
ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు
వికారాబాద్ బ్యూరో 6 డిసెంబర్ ప్రజా పాలన : జనవరి 18 నుండి రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ శ్వేత మహంతి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ లతో కలసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో అందరూ ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ప్రజలకు ఎంతో మేలు చేసే ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల్లోని అధికారులు ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా సీరియస్ గా తీసుకొని పని చేయాలన్నారు. జిల్లాల్లో ప్రభావ వంతంగా నిర్వహించేందుకు సూక్ష్మ స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం 8 నెలలు జరిగిందని, రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం వంద రోజులు పని దినాలలో  పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం కంటి వెలుగు కార్యక్రమంలో గతం కంటే టీమ్ లు పెంచిందన్నారు. మొదటి సారి 827 బృందాలు పని చేస్తే, ఇప్పుడు 1500 ఏర్పాటు చేసిందన్నారు. 
రాష్ట్ర ప్రజలందరికీ పరీక్షలు చేసి ఉచితంగా అద్దాలు పంపిణీ చేస్తామన్నారు. అవసరమైన అద్దాలు ఆయా జిల్లాలకు పంపిణీ చేయడం వెంటనే పూర్తి చేయాలన్నారు. పరీక్షలు చేసిన నెల రోజుల్లో ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. రోజు వారీ వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు, వివిధ శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. మున్సిపల్, పంచాయితీ రాజ్ అధికారులతో చర్చించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్లాన్ చేసుకోవాలన్నారు. మండల, జిల్లా, పురపాలక సంఘం మీటింగ్ లలో కంటి వెలుగు పై చర్చించి ప్రజా ప్రతినిధులకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయాలన్నారు. జిల్లాలో మైక్రో ప్లానింగ్ పూర్తి అయిన తర్వాత జిల్లా ఇంఛార్జి మంత్రి , స్థానిక ప్రజాప్రతినిధుల తో జిల్లా వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలనీ, ఏ రోజు ఎక్కడ క్యాంపు నిర్వహించాలో పకడ్బందీ కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్లాన్ చేసుకోవాలని, అదనపు బృందాలు సిద్దంగా ఉండాలన్నారు. జిల్లాలో 5 శాతం బఫర్ టీమ్ ( అడ్వాన్స్ టీమ్) లు పెట్టుకోవాలన్నారు. పరీక్షలు చేసుకోవడం మిస్ అయిన వారీ కోసం కూడా మళ్ళీ ఏర్పాటు చేయాలన్నారు. స్టేట్ లెవెల్ 10 క్వాలిటీ కంట్రోల్ టీం, జిల్లాకు ఒక క్వాలిటీ కంట్రోల్ టీమ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వీరు ప్రభావవంతంగా కార్యక్రమం జరుగుతుందా లేదా అని పరిశీలన చేస్తారన్నారు. 960 వైద్యులను వారం రోజుల్లోగా కొత్తగా నియమాకాలు చేస్తున్నామన్నారు. ఎలాంటి వైద్య సిబ్బంది కొరత లేదన్నారు. గ్రామ, మండల , జిల్లా స్థాయిలో కంటి వెలుగు కార్యక్రమం పై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.
ప్రభుత్వం తరపున అన్ని విధాలా పూర్తి స్థాయి సహకారం ఉంటుందని తెలిపారు. కంటి సమస్యలతో ఏ ఒక్కరూ రాష్ట్రంలో బాధ పడకూడదు అనే లక్ష్యంతో సీఎం  ఉన్నారని తెలిపారు. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు అయ్యేలా అందరం కృషి చేద్దాం అన్నారు.  ప్రాథమిక వైద్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు గాను, పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి చేస్తున్న సబ్‌ సెంటర్లు, పీహెచ్‌సీల కొత్త నిర్మాణాలు, మరమ్మతుల పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.  హైదరాబాద్ నుండి హాజరైన వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిఖిల, జిల్లా రెవిన్యూ అధికారి అశోక్ కుమార్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పాల్వన్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.