తెలంగాణను కాపాడుకునేందుకు కోదండరాం నే గెలిపించండి: ఎన్డీ జిల్లా నాయకులు ఈసం శంకర్

Published: Tuesday March 09, 2021

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, మార్చి 08,  ప్రజాపాలన:  కొట్లాడి సాధించుకున్న తెలంగాణను కాపాడుకునేందుకు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాం నే గెలిపించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఈసం శంకర్ అన్నారు. ఈ మేరకు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని శంభునిగూడెం, కాచనపల్లి హాస్టల్స్, స్కూల్లలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయలు, పట్టభద్రులను కలిసి కోదండరాం కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కోదండరాం పోషించిన పాత్ర ఎనలేనిదని, కొట్లాడి సాధించుకున్న తెలంగాణను కాపాడుకునేందుకు ప్రొఫెసర్ కోదండరాం ను గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు.  ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోదండరాం తోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులు ఈసం చంద్రన్న, బొర్ర వెంకన్న, జి రామ్ చందర్, డాక్టర్ గణేష్, జగన్, రవి తదితరులు పాల్గొన్నారు.