ఆదర్శ గ్రామాల సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరచాలి

Published: Wednesday October 19, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 18 అక్టోబర్ ప్రజా పాలన : గ్రామ పంచాయతీలకు అవార్డుల కోసం ఎంపిక చేసిన (54) మోడల్ గ్రామ పంచాయతీలలో చేపట్టిన అభివృద్ధి పనుల సమాచారాన్ని సక్రమంగా ఎలాంటి తప్పులు లేకుండా ఆన్ లైన్ లో పొందుపర్చాలని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సంబంధిత జిల్లా అధికారులతో జాతీయ పంచాయతీ అవార్డు కార్యాచరణ పై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలోని 566 గ్రామపంచాయతీల నుండి మోడల్ గ్రామ పంచాయతీలుగా 54 జిపిలలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలకు సంబందించిన డాటా ఎంట్రీ పనులు తప్పులు దొర్లకుండా ఆన్ - లైన్ లో అప్లోడ్ చేయాలన్నారు.  వీటి ఆధారంగా ఉత్తమ గ్రామ పంచాయతీల ఎంపిక కొసం కేంద్ర ప్రభుత్వ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలనకు వస్తారని, అప్లోడ్ చేసిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు మన ఊరు - మన బడి క్రింద చేపడుతున్న పనులను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలని,  ఇట్టి పనుల పురోగతిపై బుధవారం మండలాల వారిగా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.  జిల్లాలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు అన్నింటిని గ్రౌండింగ్ పనులు పూర్తి చేయాలని సూచించారు. వరి ధాన్యం సేకరణకు జిల్లాలో 121 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడానికి సిద్ధం చేయాలన్నారు.  ప్రతి మండలానికి ఒక ఇంచార్జి అధికారిని ఏర్పాటు చేసి, ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి ధాన్యం రైతుల నుండి సేకరించాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, డి ఆర్ డి ఓ కృష్ణన్, డీపీవో మల్లారెడ్డి, జిల్లా వైద్య అధికారి పాల్వన్ కుమార్, డి ఇ ఓ రేణుకదేవి, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేశ్వర్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ విమల, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, మిషన్ భగీరథ ఇఇ బాబు శ్రీనివాస్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి అనీల్ కుమార్, జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి లలితా కుమారి తదితరులు పాల్గొన్నారు.