రైతుల పరిస్థితి దయనీయంగావుంది
Published: Saturday May 28, 2022
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి
తాండూరు మండల బిజెపి నాయకుల డిమాండ్.
బెల్లంపల్లి మే 27 ప్రజా పాలన ప్రతినిధి:
ధాన్యాన్ని కొంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు, మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో ఒక్క గింజ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని, వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులను ఆదుకోవాలని మండల బిజెపి పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శుక్రవారం తాండూర్ మండలం, రేచిని గ్రామ పంచాయతీలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నాయకులు సందర్శించారు.
ఈ సందర్భంగా బీజేపీ మండల ఉపాధ్యక్షులు, బామనిపెల్లి ఆనంద్, మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్ గౌడ్, మాట్లాడుతూ, రైతులు పండించిన ప్రతి గింజ కొంటామని నమ్మబలికిన టిఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పటివరకు తాండూర్ మండలంలో ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని విమర్శించారు.
వర్ష సూచనతో రైతులు మొగులు వైపు చూస్తూ దిగులు పడుతుంటే, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల తీరు మాత్రం, దున్నపోతు మీద వాన పడినట్లుగా ఉందని దుయ్యబట్టారు. కొనుగోలు కేంద్రంలో తేమ, తాలు, పేరుతో, అధిక తూకం వేయడం, కొనుగోలు రశీదు ఇవ్వకపోవడం, ధాన్యం లోడింగ్ చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఆడేశ్రీనివాస్,సోమయ్య, రవితేజ, మల్లేష్, గణేష్, సాయి, శ్రీధర్, ప్రవీణ్, తదితర రైతులు పాల్గొన్నారు.
Share this on your social network: