అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా కృషి చేయాలి

Published: Thursday December 08, 2022
 విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వికారాబాద్ బ్యూరో 7 డిసెంబర్ ప్రజా పాలన : విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా కృషి చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉపాధ్యాయ బృందానికి సూచించారు. బుధవారం వికారాబాద్ జిల్లా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కొత్తగడిలో ఏర్పాటు చేసిన  50వ జిల్లా స్థాయి సైన్స్,గణితము, పర్యావరణ ప్రదర్శనను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన  సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి  మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులలలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయటానికి ఇలాంటి సైన్స్ ఫేర్ లు ఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు. వికారాబాద్ జిల్లా నుండి అంతర్జాతీయ స్థాయిలో రాణించిన విద్యార్థిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాక్షించారు. వికారాబాద్ జిల్లాలో సైన్స్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. సమస్యతోనే పరిష్కారం పుట్టుకువస్తుందని, కరోనా సమయంలో మందుల సరఫరా ఎలాంటి ఆటంకం లేకుండా సాగేలా,త్వరితగతిన చేరేలా డ్రోన్ సహాయంతో జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టడం జరిగిందన్నారు. వ్యాపారాలు,పారిశ్రామిక వేత్తలుగా రాణించాటానికి ప్రభుత్వం టి -హబ్ ద్వారా కృషి చేస్తుందని ఇందులో  విద్యార్థుల కోసం కొంత స్పెస్ కేటాయిస్తున్నట్లు మంత్రి కేటీఆర్  ప్రకటించారని తెలిపారు.స్వంత ఆలోచనలతో  రండి పరిశ్రామిక వేత్తలుగా ఎదాగాలన్నదే ప్రభుత్వ అభిమతం అన్నారు. పరిశ్రమలు స్థాపించి, తాము ఎదగటమే కాకుండా నలుగురికి ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. మంత్రి కేటీఆర్  ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమంతో అనేక నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారని మంత్రి అన్నారు. ఆసక్తి ఉన్న రంగాల్లో రాణించేలా విద్యార్థులను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని పెద్ద ఎత్తున గురుకులాలు ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థి పై ఒక  లక్ష 20 వేలు ఖర్చు చేస్తుందన్నారు. ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం మంత్రి తిలకించారు. భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా, నూతన ఆవిష్కరణలు చేసి వ్యాపారవేత్తలుగా రాణించాలని ఆకాంక్షించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతోపాటు ఆటల పోటీలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.  ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు ఉన్న ఆసక్తిని పసిగట్టి వారిని ఆ రంగాలలో  ప్రోత్సహించాలని కోరారు. విద్యార్థులకు పాటల పోటీలలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సదుపాయాలతో పాటు మంచి ఉపాధ్యాయులు, ఆహారం అందించడం జరుగుతుందని, ఇట్టి సదుపాయాలను ప్రభుత్వ పాఠశాలలు గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు  వినియోగిం చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు.  ఈసారి పదవ తరగతిలో మంచి ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు అందరూ బాగా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు.  జిల్లాలో పాఠశాలల అభివృద్ధికి జడ్పీ నిధులను కేటాయించడం జరుగుతుందని తెలియజేశారు. స్థానిక శాసన సభ్యులు డా. మెతుకు ఆనంద్ మాట్లాడుతూ, మంచి అవకాశాలు గొప్ప వారికే వస్తాయని అనుకోవద్దని, కృషి పట్టుదలతో ప్రతి ఒక్కరూ గొప్పవారవుతారని అన్నారు. లోకజ్ఞానం కూడా ప్రతి ఒక్కరికి అవసరమని తెలిపారు.మట్టిలో ఉన్న మాణిక్యాలను వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్లు ఎంతగానో ఉపయోగపడతాయని, పట్టుదల  కృషితో దేనినైనా సాధించవచ్చని తెలిపారు. ఇక్కడ ఉన్న విద్యార్థులు తమ కృషితో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.
బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ, గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్లు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.విద్యార్థులు తమలో దాగి ఉన్న ప్రతిభను దేశ స్థాయిలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో గుర్తించే విధంగా తమ తెలివి తేటలను ప్రదర్శించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  చేవెళ్ల శాసన సభ్యులు కాలే యాదయ్య,  మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్, జడ్పీ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్, జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ ,డి ఈ ఓ రేణుకా దేవి, జిల్లా సైన్స్ ఆఫీసర్ స్థావర విశ్వేశ్వర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.