విద్యుత్ ఫీడర్ ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Published: Friday June 18, 2021

24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తు, ఎమ్మెల్యే జియంఆర్
అమీన్పూర్, జూన్ 17, ప్రజాపాలన ప్రతినిది : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తు అందిస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ సబ్ స్టేషన్ నుండి వడక్ పల్లి వరకు ఏర్పాటు చేసిన నూతన ఫీడర్ లైన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ వ్యవసాయం, గృహ అవసరాలు, పారిశ్రామిక రంగానికి కోతలు లేని నాణ్యమైన విద్యుత్ అందించిన మూలంగా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకు వెళుతోందని అన్నారు.  ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరొందిన పటాన్చెరు పారిశ్రామిక వాడలో నేడు నాలుగు షిఫ్టుల్లో కర్మాగారాలు పనిచేస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి విద్యుత్ రంగంలో తీసుకు వచ్చిన సంస్కరణలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా అవసరాలకు అనుగుణంగా నూతన సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానందం, జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ  సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.