మన ఊరు మనబడి పనులను పూర్తి చేయాలి

Published: Saturday December 24, 2022
టీఎస్ ఈడబ్ల్యుఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 23 డిసెంబర్ ప్రజా పాలన : మన ఊరు మనబడి కార్యక్రమం కింద చేపడుతున్న పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని టీఎస్ ఈడబ్ల్యుఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి సూచించారు. శుక్రవారం మన ఊరు మనబడి కార్యక్రమం కింద చేపట్టే పనులను పర్యవేక్షణకు వచ్చిన చైర్మన్ నవాబ్ పెట్  మండలం మాదారం గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అధికారులతో మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మంచి విద్యను అందించేందుకు, అన్ని మౌలిక సౌకర్యాలతో కూడిన వసతులను కల్పిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. పాఠశాలలో 58 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ తొమ్మిది లక్షల వ్యయంతో పాఠశాల మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు ప్రహరీ గోడను నిర్మించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.  పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్న పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. చైర్మన్ పాఠశాలల గదులను సందర్శించి విద్యార్థులతో ముచ్చటిస్తూ చదువు బాగా చెబుతున్నారా మీరు మంచిగా చదువుకుంటున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ , జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకా దేవి , ఎంపీడీవో సుమిత్రమ్మ , మండల విద్యాశాఖ అధికారి గోపాల్, ఎస్ఎంసి చైర్మన్ లావణ్య ప్రభాకర్ , ప్రధానోపాధ్యాయులు ప్రమీల ,  గ్రామపంచాయతీ కార్యదర్శి లావణ్య తదితరులు పాల్గొన్నారు.