న్యాయవాదిని చంపిన హంతకుల్ని కఠినంగా శిక్షించాలి

Published: Wednesday August 03, 2022

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 02 (ప్రజాపాలన ప్రతినిధి): 
హన్మకొండ కు చెందిన న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డి పై దాడి చేసి అత్యంత కిరాతకంగా చంపిన హంతకుల్ని కఠినంగా శిక్షించాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పసునూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంథనిలో వామన్ రావ్ దంపతుల హత్యఘటన మరవకముందే మరో దుర్ఘటన చోటు చేసుకోవడం దారుణమన్నారు, ఇలాంటి సంఘటనల్లో నిందితుల తరపున రాష్ట్రంలోని ఏ న్యాయవాది కూడా వకాల్తా పుచ్చుకోకుండా, నిందితుల తరపున వాదించకుండా అన్ని బార్ అసోసియేషన్ లు సమిష్టి తీర్మానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి హంతకుల నేరాల్ని ఆధారాలతో  రుజువు చేసి,వారికి కోర్టులో కఠిన శిక్షలు పడేలా పోలీసులు కృషి చేసినప్పుడే ఇలాంటి దారుణ ఘటనలు పునరావృతం కావని ఈ సందర్భంగా శ్రీనివాస్ పేర్కొన్నారు