ఎమ్మెల్యే తన కుటుంబాన్ని చంపుతా అన్నారు... ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేసిన మహిళ నేత

Published: Monday September 06, 2021
బెల్లంపల్లి, సెప్టెంబర్ 5, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి ఎమ్మెల్యే(తెరాస) దుర్గం చిన్నయ్య ఫోన్ లో తనను దుర్భాషలాడి కుటుంబాన్ని మొత్తం చంపేస్తానని బెదిరించాడని టిఆర్ఎస్ పార్టీలో నే కొనసాగుతున్న తోడే పద్మా రెడ్డి అనే మహిళ శనివారం అర్థ రాత్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన ఆదివారం నాడు వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే తోడే పద్మా రెడ్డి కుమారుడు తోడే కృష్ణారెడ్డి స్టేట్స్ లో ఉండి స్థానిక అక్రమ నిర్మాణాల కూల్చివేతను అడ్డుకున్న మున్సిపల్ కౌన్సిలర్ల పై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కు ట్విట్టర్లో పెట్టిన ఫిర్యాదు విషయంపై ఫోన్లో తనను బెదిరించారని, అమె కొడుకుని, కుటుంబాన్ని, తనను అంతం చేయిస్తానని, అసభ్యకరంగా దూషించాడని ఆమె తెలిపారు. ఈ విషయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని నాకు నా కుటుంబానికి దుర్గం చిన్నయ్య తో తన అనుచరులతో ప్రాణహాని ఉందని ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా స్థానిక కాంగ్రెస్ నాయకురాలు రోడ్డ శారద మాట్లాడుతూ ఒక మహిళ అని చూడకుండా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అసభ్యకరంగా మాట్లాడిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కేసు నమోదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని, బహిరంగంగా ఆమెకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.