కరోనా బాధిత బి.సి. కుటుంబాలకు రాయితీతో కూడిన రుణ సదుపాయం : జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
మంచిర్యాల జిల్లా ప్రతినిధి, జూన్ 24, ప్రజాపాలన : కరోనా కారణంగా కుటుంబాన్ని పోషిస్తున్న 18 సం॥ల నుండి 60 సం॥ లోపు వయస్సు వారు చనిపోతే ఆ కుటుంబాలకు జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక అభివృద్ధి సంస్థ ద్వారా యూనిట్ విలువ 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యునిట్ లో లబ్ది దారులకు 80 శాతం రుణం (4 లక్షల రూపాయలు), 20 శాతం రాయితీ (1లక్ష రూపాయలు)లు అందించడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి ఉన్న సంబంధిత కుటుంబాల వారు దరఖాస్తు చేసుకోవాలని చూసించారు. అదేవిదంగా కరోనా కారణంగా మృతి చెందిన వెనుకబడిన తరగతుల కులస్తుల కుటుంబ యజమాని పేరు, చనిపోయే నాటికి వారి వయస్సు, ఆధార్ నంబర్, చిరునామా, కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల పేర్లు ఇతర వివరాలతో కూడిన దరకాస్తును సి.సి.సి. నస్పూర్ నందు గల జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి కార్యాలయంలో ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గం॥ల లోగా అందజేయాలని తెలిపారు. దరఖాస్తు కోసం సంబంధిత రిజిస్ట్రార్ అధికారి ద్వారా జారీ చేయబడిన జనన, మరణ ధృవీకరణ పత్రములు, తహశిల్దార్చే జారీ చేయబడిన కుల ధృవీకరణ పత్రము, వార్షిక ఆదాయం 3 లక్షల రూపాయలు లోపు ఉన్న ఆదాయ ధృవీకరణ పత్రము జత పరచవలసి ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Share this on your social network: