గుంతలు తప్పించబోయి.. నిండు ప్రాణం బలి..

Published: Tuesday November 16, 2021
ఎదురెదురుగా ఢీకొన్న బైకులు..
ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు..
తల్లాడ, నవంబర్ 15 (ప్రజాపాలన న్యూస్) : మరో ఐదు నిమిషాలు గడిస్తే ఇంటికి వేరే వాడే.. కుటుంబ సభ్యులతో హాయిగా గడిపేవాడు. కానీ ఇంతలోనే మృత్యువు దూసుకొచ్చింది. ఆ కుటుంబానికి కన్నీటి బాధను మిగిల్చింది. ప్రమాదకరంగా ఉన్న గుంతలు ఆ కుటుంబాన్ని తీరని శోకాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం ఉదయం 9 గంటల సమయంలో తల్లాడలో చోటుచేసుకుంది. మల్లవరంకు చెందిన వరద బోయిన నాగరాజు ఖమ్మం నుండి తల్లాడకు బైక్ పై వస్తున్నాడు. తల్లాడ నుండి క్రీస్తుజ్యోతి కళాశాలకు నారాయణపురంకు చెందిన నవీన్, అవినాష్, మంజు ముగ్గురు విద్యార్థులు ఒకే బైక్ పై కళాశాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నాగరాజు పెట్రోల్ బంక్ సమీపంలోని రాగానే ఓ లారీని ఓవర్టేక్ చేస్తుండగా తల్లాడ నుండి వస్తున్న బైకును గుంతలు తప్పించబోయి ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. నవీన్, అవినాష్, మంజులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న తల్లాడ ఎస్ఐ సురేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. క్షతగాత్రులను 108 ద్వారా ఆసుపత్రికి చేర్పించారు. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో మృతుని బంధువులు కన్నీటిపర్యంతమయినా తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.