బీసీ గురుకులాల్లో సమ్మర్ క్యాంపులు రద్దు చేయాలి ** యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు దూలం ఎల్లయ్య *

Published: Wednesday April 19, 2023
ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 18 (ప్రజాపాలన,ప్రతినిధి) : 
మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో సమ్మర్ క్యాంపు ల పేరిట విద్యార్థులను, ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని సమ్మర్ క్యాంపు రద్దు చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు దూలం ఎల్లయ్య డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా  ఆసిఫాబాద్ గురుకుల పాఠశాలలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర నాయకుడు దూలం ఎల్లయ్య  మాట్లాడుతూ సమ్మర్ క్యాంపుల పేరిట వేసవి సెలవుల్లో కూడా క్లాసులు నిర్వహించటం సరికాదని, వేసవి సెలవులు విద్యార్థుల ఒత్తిడిని తగ్గించి మానసిక ఉల్లాసం కొరకు వినియోగించేలా ఉండాలని, మండే ఎండలలో ప్రతికూల వాతావరణంలో సమ్మర్ క్యాంపు ల పేరిట తరగతులు నిర్వహించడం వలన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. దీనిని వెంటనే వెనక్కి తీసుకోవాలని, వేసవి సెలవుల్లో అకాడమిక్ యాక్టివిటీస్ చేయడం, దానికోసం బలవంతంగా పంపడం సరికాదని,కావున వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టియస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సోయం ఇందు రావ్, నాయకులు హేమంత్ షిండే, రమేష్, వినోద్, చంద్రయ్య, రాధిక, శ్యాం, సంతోష్, లింగయ్య, గజానంద్, తదితరులు పాల్గొన్నారు.