అసెంబ్లీ సభా సంప్రదాయాలను తుంగలో తొక్కిన వైసీపీ.
Published: Tuesday November 23, 2021
తల్లాడ, నవంబర్ 22 (ప్రజాపాలన న్యూస్): ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు వారి అవివేకానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ తల్లాడ మండల అధ్యక్షులు కూచిపూడి వెంకటేశ్వర రావు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో సభా, సంప్రదాయాలను గౌరవించకుండా వ్యక్తిగతంగా ప్రతిపక్ష నాయకుని సతీమణిపై అసభ్యంగా మాట్లాడటం తగదన్నారు. అసెంబ్లీలో అధికార పార్టీ హుందాగా వ్యవహరించాల్సిందిపోయి తాగుబోతుల్లా, గుండాల్లా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో ఏపీతో పాటు తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ తిరుగులేని శక్తిగా అవతరిస్తుందన్నారు. ప్రజలు ప్రస్తుతం జరిగే పరిణామాలను గమనిస్తున్నారని, వారికి తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. ఇప్పటికైనా చౌకబారు విమర్శలు మాని అభివృద్ధికి పాటుపడాలని ఆయన హితవు పలికారు. ఈ సమావేశంలో పలువురు తేదేపా నాయకులు సరికొండ శ్రీనివాసరాజు, వడ్ల నాగేశ్వరరావు, శీలం నర్సిరెడ్డి, ఎండీ బాబు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: