పేద ప్రజలకు ఉచిత న్యాయ సేవలు

Published: Wednesday October 27, 2021
రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ మెంబెర్ సెక్రటరీ రేణుక
వికారాబాద్ బ్యూరో 26 అక్టోబర్ ప్రజాపాలన : పేద ప్రజలకు ఉచిత సేవలు ఎలాగైతే లభిస్తున్నాయో అదే విధంగా ఉచిత న్యాయ సేవలు కూడా లభిస్తాయని ప్రతి గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ మెంబెర్ సెక్రటరీ రేణుక తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఉచిత న్యాయ సహాయంపై అవగాహనపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, న్యాయం దృష్టిలో అందరు సమానమే కాని అవగాహన లేని నిరుపేదలు ఇట్టి అవకాశాన్ని పొందలేకపోతున్నారని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయం అందేలా గ్రామాలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయినవని, న్యాయ సేవా చట్టం అమలుల్లోకి వచ్చి 25 సంవత్సరములు పూర్తి అయినందున ఆజాదీక అమృత్ మహొత్సవాలలో భాగంగా అక్టోబర్ 02 నుండి నవంబర్ 14 వరకు అన్ని గ్రామాలలో ఉచిత న్యాయం చట్టాల పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలందరికి ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే ఉచిత వైద్యం ఎలా అందుతుందో అలాగే జిల్లాలలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో పేద ప్రజలకు ఎలాంటి ఫీజులు లేకుండా ఉచిత న్యాయ సహాయం అందుతుందని, ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్నామని తెలిపారు. మహిళలకు, పిల్లలకు, కార్మికులకు, దివ్యంగులకు వార్షిక ఆదాయం 3 లక్షల కంటే తక్కువ ఉన్న వారందరికీ ఉచిత న్యాయం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందుతుందని అవగాహన కల్పించాలని తెలిపారు. సమాజంలో 30 శాతం మంది మాత్రమే ఉచిత న్యాయ సేవను వినియోగించుకుంటున్నారని, మిగిలిన 70 శాతం మంది వివిధ కారణాల వల్ల పొందలేక పోతున్నారని,అందుకే ప్రజలందరికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహయం అందుతుందని తెలుపుచూ ప్రజల్లో అవగాహన పెంపొందించుటకు అధికారులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను ఏవిధంగా అయితే ప్రజల్లోకి తీసుకెళ్లుతున్నారో ఉచిత న్యాయం గురించి కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు. నవంబర్ 8 నుండి 14వరకు న్యాయ సేవల వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో మూడు రోజుల అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రామాలలో ప్రజల్లో అవగాహన పెంపొందించుటకు జ్యూడిషియల్ ఆఫీసర్, ప్యానల్ లాయర్, పారా లీగల్ వాలంటీర్లు, న్యాయ విద్యార్థులు, ఎన్.జి.వో. లు, సోషల్ అక్టివిస్టులతో టీములను ఏర్పాటు చేసి గ్రామాలలో ప్రజలకు ఉచిత న్యాయం, న్యాయ చట్టాల పై అవగాహన నిర్వహించేందుకు వచ్చే వారికి మీ సహాకారం అందించాలని గ్రామ పంచాయతీ అధికారులు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. హత్య, రేప్, మైనర్ బాలికలపై అఘాత్యాలకి గురైన వారికి రూ.ఏడు లక్షలు, ఆక్సిడెంట్లో అంగవైకల్యం చెందిన వారికి నాలుగు లక్షలు, తాత్కాలిక గాయలకు రెండు లక్షల చొప్పున బాధితులకు నష్టపరిహారం అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పథకాలను, వాక్సినేషన్ ను విజయవంతంగా పూర్తి చేసినందుకు అధికారులను ప్రశంసించారు.  అదే స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి అధికారి గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కృషి చేయాలని కోరారు. గ్రామాలలో సర్పంచ్లు, గ్రామ కార్యదర్శులు, అంగన్వాడీ సిబ్బంది ఉచిత న్యాయ సేవలపై అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిఖిల, అదనపు జిల్లా జడ్జి పద్మ, జిల్లా SP నారాయణ, అదనపు కలెక్టర్ చంద్రయ్య, ASP రషీద్, జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, DRDO కృష్ణన్, DM&HO తుకారం, ఎక్సజ్ సూపరింటెండెంట్ వరప్రసాద్, DWO లలితకుమారి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.