ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసులను సమర్ధవంతంగా పరిష్కరించాలి

Published: Saturday July 16, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో జూలై 15 ప్రజాపాలన : ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసులను వివక్ష లేకుండా సమర్థవంతంగా  సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్  సమావేశ మందిరంలో ఎస్సీ,  ఎస్టీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది.   ఈ సందర్భంగా జిల్లాలో యస్సి, యస్టి అత్యాచార నిరోధక పురోగతిపై కలెక్టర్ మాట్లాడుతూ,  జిల్లాలో 2021 సంవత్సరంలో  ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద 54 కేసులు నమోదు చేయడం జరిగిందని,  ఇట్టి కేసులకు సంబంధించి బాధితులకు 59 లక్షల నష్టపరిహారాన్ని అందించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.  అందులో  ఎఫ్ఐఆర్ నమోదైన 47 కేసులకు 29 లక్షల 25 వేలు నష్టపరిహారం  మరియు చార్జి షీట్ దాఖలు అయిన  39 కేసులకు 29 లక్షల 75 వేల లక్ష రూపాయల నష్టపరిహారం కింద మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.  ఈ సంవత్సరం మే నెల అఖరు వరకు 14 కేసులు నమోదు కావడం జరిగిందని అందులో బాధితులకు 13.22 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు.   ఎస్సీ ఎస్టీ అత్యాచార  కేసుల విషయంలో నిజాయితీగా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ప్రతినెల నియోజకవర్గం స్థాయిలో ప్రతి గ్రామంలో పౌర హక్కుల దినాన్ని క్రమం తప్పకుండా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని  కలెక్టర్ తెలిపారు. నష్టపరిహారం పునారావసం విషయంలో ఆలస్యం జరగకుండా చూడాలని సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. సభ్యులు సూచించే ప్రతి దానిని పరిగణలోకి తగు చర్యలు తీసుకుంటామని  కలెక్టర్ తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్మెంట్ భూముల విషయంలో త్వరలో జరిగే రెవెన్యూ సదస్సులలో న్యాయం జరిగేలా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు.
 జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసుల విషయంలో పురోగతిని సాధిస్తూనే నేరస్తులకు శిక్షలు పడేలా చూస్తున్నామని తెలిపారు.  ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసులపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు పోలీస్ కళాబృందాలచే గ్రామాల్లో కార్యక్రమాలు చేపట్టినట్టు ఎస్పీ తెలిపారు. ప్రతి నెల నిర్వహించే పౌరహక్కుల దినోత్సవం కార్యక్రమంలో పోలీస్ శాఖ అధికారులు తప్పనిసరిగా పాల్గొంటారని ఆయన అన్నారు. వికారాబాద్ చేవెళ్ల శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్, కాలె యాదయ్య లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరిస్తే సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని అన్నారు. కొన్ని  అనివార్య కారణాల వల్ల కేసుల పరిష్కారంలో జాప్యం జరుగుతున్నాయని, వాస్తవాలను వెలుగు తీసి ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందని వారు అన్నారు.  ప్రాధాన్యత క్రమంలో కేసులను పరిష్కరించాలని వారు సూచించారు. ఈ సమావేశంలో డివిఎంసి సభ్యులు రాడ్ సొసైటీ ఈడి సత్యవతి, దళిత స్త్రీ శక్తి కోఆర్డినేటర్ భాగ్యలక్ష్మి, సభ్యులు జె. రాములు, ఇ.యాదయ్య , నక్క రమేష్,  అడ్వకేట్ బాలయ్యలతో పాటు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం,  జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కోటాజీ,  ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబుమోజెస్, జిల్లా ట్రెజరీ అధికారి దశరథ్, వికారాబాద్, తాండూర్ , పరిగి డిఎస్పీలు, రెవెన్యూ, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.