విధులకు గైర్హాజరైన వారికి షోకాజ్ నోటీసులు జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్

Published: Tuesday July 19, 2022
మంచిర్యాల బ్యూరో, జులై 18, ప్రజాపాలన :
 
ప్రభుత్వ అధికారులు ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ విధుల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని, విధులకు గైర్హాజరైన అధికారులు, ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పౌరసరఫరాల అధికారి కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో కార్యాలయంలో అధికారులు, ఉద్యోగులు లేకపోవడంతో విధులకు గైర్హాజరైన డి.టి. వరదరాజు, డి.టి.ఎ. అన్వేష్, కంప్యూటర్ ఆపరేటర్ వనంతలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధులకు సక్రమంగా హాజరై వర్షాభావ పరిస్థితులలో అత్యవసర సేవలు అందించడంలో భాగంగా కార్యాలయానికి రావలసి ఉండగా విధుల పట్ల నిర్లక్ష్యం, గైర్హాజరు కావడం బాధ్యతారాహిత్యమని, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ప్రజలతో మమేకమై జవాబుదారితనం కలిగి ఉండాలని అన్నారు.