టిఆర్ఎస్ కి బిజెపి భయం పట్టుకుంది.!? ప్రజా సంగ్రామ యాత్ర .. హనుమకొండ సభకు ఆటంకాలు .. అడ్డంకులే
Published: Saturday August 27, 2022
బిజెపికి మద్దతుగా ..బాసటగా నిలవండి.. 27సభను విజయవంతం చేయండి..
బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర
కరీంనగర్ ఆగస్టు 26 ప్రజాపాలన ప్రతిని :
తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిన బిజెపి ని చూసి అధికార టీఆర్ఎస్ భయపడుతుందని,అందుకే ప్రజా సంగ్రామ యాత్ర,జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యే ముగింపు సభకు ఆటంకాలు అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నం చేస్తుందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర ఆరోపించారు. శుక్రవారం కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వ కుట్రలను, దిక్కుమాలిన రాజకీయాలను తిప్పి కొట్టడానికి, బిజెపికి మద్దతు, బాసటగా నిలవడానికి నడుం బిగించి యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కుటుంబ పాలన నుండి కాపాడుకోవడానికి, నిరంకుశ కెసిఆర్ ప్రభుత్వ తరిమి కొట్టడానికి,తెలంగాణలోధర్మాన్ని న్యాయాన్ని బతికించడానికి బిజెపి కార్యకర్తలు, అభిమానులు ,శ్రేయోభిలాషులు, అన్ని వర్గాల ప్రజలు 27న శుక్రవారం హనుమకొండలో తలపెట్టిన సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ కుటుంబ చేతిలో బందీ అయి,ఎనిమిదేళ్లుగా తీవ్ర అన్యాయానికి నష్టానికి గురైందని, అందుకే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ కెసిఆర్ ప్రభుత్వం పై పోరాడుతున్నారని, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం , రాష్ట్ర ప్రజల గోడును తెలుసుకోవడానికి , ప్రజలందరికీ తగిన భరోసా కల్పించడానికి ప్రజా సంగ్రమయాత్ర చేపట్టారని తెలిపారు.ముఖ్యంగా మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర , ముగింపు సభకు
జరగకూడదనే ఉద్దేశంతో అధికార టిఆర్ఎస్ పార్టీ అనేక అవరోధాలు , ఆటంకాలు సృష్టించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తుందని ఆయన దుయ్యబట్టారు . ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవాలనుకున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి కోర్టులో చెంపపెట్టు లాంటి తీర్పు వచ్చిందని, తిరిగి బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర దిగ్విజయంగా ఆరంభమైందన్నారు. అలాగే హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ముఖ్యఅతిథిగా హాజరవుతున్న మహాసభకు ఆటంకాలు సృష్టించాలని కెసిఆర్ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తున్న , ధర్మం గెలుస్తుందని ,సభ అనుకున్న సమయానికి యధావిధిగా కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం వచ్చేలా సభకు బిజెపి కార్యకర్తలు, పార్టీ అభిమానులు ,శ్రేయోభిలాషులు , అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి , మద్దతు, బాసటగా నిలిచి విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిరంకుశ, అవినీతి కుటుంబ పాలనపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సమర శంఖం పూరించడంతో టిఆర్ఎస్ తట్టుకోలేక, భయపడి పోతుందని ,అందుకే బిజెపి లక్ష్యంగా పనికిమాలిన రాజకీయాలు చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఆదాయ వనరుగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో అప్పుల రాష్ట్రంగా మార్చిందని, అన్ని వర్గాల ప్రజలకు, ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. లిక్కర్ స్కాం ఆరోపణలు , మత పరమైన అంశాలను , కుట్రలను పక్కదారి పట్టించడానికి, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి , కుటుంబాన్ని రక్షించుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పడరాని పాట్లు పడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.ప్రజా వ్యతిరేక టీఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి బిజెపి చేస్తున్న ధర్మ పోరాటంలో, టిఆర్ఎస్ ప్రభుత్వ పునాదులు కదిలించడానికి తెలంగాణ సమాజంలోని ప్రతి ఒక్కరు నడుం బిగించాల్సిన అవసరం, సమయం ఆసన్నమైందన్నారు. అందులో భాగంగానే జరుగుతున్న హనుమకొండ మహాసభకు బిజెపి కార్యకర్తలు , అభిమానులు శ్రేయోభిలాషులు, అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
Share this on your social network: