నిరుపేదలకు అండగా మలబార్ గోల్డ్

Published: Tuesday May 11, 2021
అమీర్ పేట( ప్రజాపాలన ప్రతినిధి) : ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు అండగా నిలిచింది. సోమవారం మలబార్ గోల్డ్ సోమాజిగూడ స్టోర్ హెడ్  షరీజ్ సోమాజిగూడ, పంజాగుట్ట, ఖైరతాబాద్, సనత్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ, రహ్మత్ నగర్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో పర్యటించి నిరుపేదలకు అవసరమైన కిరాణా సామాగ్రి కిట్లను అందజేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఐదు వందల మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించడం ఎంతో ఆనందంగా ఉంది అని అన్నారు. 260 కి పైగా షోరూమ్ లతో పది దేశాలలో విస్తరించి ఉన్న తమ సంస్థ ఆది నుంచి సామాజిక సేవా కార్యక్రమాలను పేదలకు అందించడంలో ముందుంది అని అన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నాలుగు వేలకు పైగా కిరాణ కిట్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. త్వరలోనే ఇటువంటి సామాజిక సేవలను ప్రపంచ వ్యాప్తంగా విస్తరింప చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజ్ మెంట్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.