నాశబోయిన నరసింహ(నాన)కు జాతీయస్థాయి'శ్రమ యోధ' పురస్కారం
Published: Thursday May 27, 2021
వలిగొండ, ప్రజాపాలన ప్రతినిధి : ప్రతియేటా వివిధ సేవా రంగాలలో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు గుర్తింపుగా ఎకె తెలుగు మీడియా సంస్థ ముంబై వారు అందించే జాతీయ స్థాయి ఉత్తమ సేవా పురస్కారం 'శ్రమ యోధ 2021 అవార్డును' ఆరోగ్య పర్యవేక్షకుడు కవి, రచయిత నాశబోయిన నరసింహ (నాన) అందుకున్నారు. కోవిడ్ మార్గ దర్శకాల దృష్ట్యా నిర్వహించిన పర్చువల్ సదస్సులో, జూమ్ మీటింగ్ ద్వారా ఆన్లైన్ లో ఎకె తెలుగు మీడియా సంస్థ, ముంబై వ్యవస్థాపకులు శ్రీ అశోక్ కంటే గారు నరసింహకు "శ్రమ యోధ" జాతీయ స్థాయి ఉత్తమసేవా పురస్కారం ప్రధానం చేశారు. నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన నరసింహ ప్రస్తుతం వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరోగ్య పర్యవేక్షకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన గత రెండు దశాబ్దాల కాలం నుంచి వైద్య ఆరోగ్య రంగంలో వివిధ ఆరోగ్య అవగాహన కార్యక్రమాలతో క్షేత్ర స్థాయిలో గ్రామీణ ప్రజలను చైతన్య పరచడం ద్వారా వృత్తిలో నైపుణ్యం ప్రదర్శిస్తూ మరోవైపు అనుమానితులను కరోనా పరీక్షలకు ప్రోత్సహిస్తూ, హోమ్ ఐసోలేషన్ లో వున్న కరోనా రోగులకు మనో దైర్యాన్ని నూరిపోసి, ఉచితంగా మందులు, కౌన్సెలింగ్ నిర్వహిస్తూ, కోవిడ్ టీకా లేయడం మొదలైన వైద్య ఆరోగ్య సేవలకు గుర్తింపుగా ఆయనకు తెలంగాణా సాహితీ రత్న అవార్డు అందించినట్లు తెలిపారు. మున్ముందు సమాజానికి మరిన్ని సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అభినందనలు తెలుపుతూ అశోక్ కంటే, ముంబై గారు పేర్కొన్నారని నరసింహ అన్నారు. ఈపురస్కారం అందుకోవడం పట్ల తన మిత్రులు, తోటి ఉద్యోగులు అభినందనలు తెలిపారు.
Share this on your social network: