సామాన్యులను నిలువు దోపిడీ చేస్తుంది టిఆర్ఎస్ ప్రభుత్వమే..
Published: Saturday July 09, 2022
పెట్రోల్ పై వ్యాట్ తగ్గించుకోకుండా
ఆర్టీసీ చార్జీలు పెంచడం దారుణం
అధిక విద్యుత్ చార్దీలు పెంచి న ఘనత
కెసిఆర్ ప్రభుత్వానికే దక్కుతుంది.
బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
కరీంనగర్ జూలై 8 (ప్రజాతంత్ర) :
టిఆర్ఎస్ ప్రభుత్వం తాత్కాలిక తాయిలాలతో ప్రజలను మభ్యపెట్టి , రాజకీయ ,అధికార పబ్బం
గడుపుకుంటూ , తెలంగాణలో అన్ని చార్జీలను విపరీతంగా పెంచి అడ్డదారిలో అడ్డగోలుగా వసూళ్లను చేపడుతూ సామాన్య ప్రజానీకాన్ని నిలుదోపిడి చేస్తుందని , అలాంటి టిఆర్ఎస్ పార్టీ గ్యాస్ ధరల పెంపుపై ఆందోళన చేపట్టి రోడ్డు ఎక్కడం హాస్యాస్పదంగా ఉందని , ప్రజలను దోచుకునే కెసిఆర్ ప్రభుత్వ పాపాన్ని బిజెపికి అంటగట్టి,బురద చల్లాలనుకోవడం అవివేకమని, టిఆర్ఎస్ రాజకీయ డ్రామాలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి విమర్శించారు. శుక్రవారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా విపరీతమైన చార్జీలను ముక్కు పిండి వసూలు చేస్తుంది, సామాన్య ప్రజలను నిలువు దోపిడీ చేస్తుంది టిఆర్ఎస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. కెసిఆర్ సర్కార్ పెంచిన విద్యుత్ బిల్లులు సామాన్య మధ్యతరగతి ప్రజలకు షాక్ కొట్టే విధంగా ఉన్నాయని , విద్యుత్ వినియోగ స్లాబ్ రేట్లు మారి వందల్లో వచ్చే కరెంట్ బిల్లు వేలలో రాబట్టుకొని దోపిడీ చేస్తుందన్నారు . అలాగే నేడు పెట్రోల్ ఉత్పత్తులతో వ్యాట్ రూపేనా లాభాలు అర్జించి కూడా ఆర్టీసీ బస్ చార్జీలు విపరీతంగా పెంచి సామాన్య ప్రజానీకాన్ని దోచుకుంటున్న ఘనత టిఆర్ఎస్కే దక్కుతుందన్నారు. దేశమంతా అనేక రాష్ట్రాలు పెట్రోల్ ఉత్పత్తులపై తమ వ్యాట్ తగ్గించుకొని సామాన్య ప్రజలకు పెట్రోల్ ,డీజిల్ ధరలు అందుబాటులోకి తెచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పెట్రోల్ ఉత్పత్తి పై వ్యాట్ పన్ను తగ్గించుకోకుండా సామాన్య మధ్యతరగతి ప్రజలను అడ్డగోలుగా దోచుకుంటుందని ఆయన దుయ్యబట్టారు. పెట్రోల్ , డీజిల్ అంశంలో బస్ చార్జీలను , స్టూడెంట్ బస్సు పాసులను సైతం గణనీయంగా పెంచిందని, ఇందులో ముఖ్యంగా రాజకీయ కుట్ర దాగి ఉందని , కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని బదనానం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం టిఆర్ఎస్ దివాలా కోరు రాజకీయానికి నిదర్శనం లాంటిదన్నారు . ముఖ్యంగా పెట్రోల్ ,డీజిల్ ,గ్యాస్ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్ పై ఆధారపడి ఉంటాయని , ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కొన్ని అనివార్య పరిస్థితులతో ధరలు విపరీతంగా పెరిగిన సామాన్య ప్రజలకు భారం కాకూడదనే ఉద్దేశంతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనేక దిద్దుబాటు చర్యలు చేపట్టి ధరలను నియంత్రణలో ఉంచడానికి సాధ్యమైనంత కృషి చేస్తుందని తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశ ప్రజలందరి సంక్షేమం అభివృద్ధి కోసం ఆలోచన చేస్తుందని, రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం ఎవరి కోసం ఆలోచన చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందో స్పష్టం చేయాలన్నారు. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేని విధంగా
భూమి రిజిస్ట్రేషన్ చార్జీలు ,
కరెంట్ చార్జీలు , గ్రామాలలో వివిధ రకాల పన్నులు ,రాష్ట్రంలో నీ అన్నిరకాల టాక్స్ లు పెంచిన చరిత్ర టిఆర్ఎస్ ప్రభుత్వం దేనన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కూల్ అధిక ఫీజులు , వసూళ్లతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతుంటే టిఆర్ఎస్ ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టిఆర్ఎస్ శ్రేణుల భూ దందాలతో సామాన్యుడు కనీసం ఇంటి స్థలం కూడా కొనుగోలు చేయని పరిస్థితి కల్పించారని ఆయన ఆరోపించారు. సామాన్యునికి అవసరమైన కూరగాయల రేట్లు నియంత్రించని పాలన కెసిఆర్ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను ప్రోత్సహించడం తిరిగి డ్రంక్ అండ్ డ్రైవ్ పేరిట దండుకోవడం , ట్రాఫిక్ చలాన్ పేరిట వాహనదారులపై ఇబ్బడి ముబ్బడి చార్జీలు వసూళ్లు చేయడానికి ఏమంటారని ఆయన ప్రశ్నించారు. నీళ్లు నిధులు ,నియామకాల ఎజెండాతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ చేతిలో పెడితే తెలంగాణ ప్రజల బతుకుచిత్రం మారలేదని , ఉద్యమ ఫలాలను అందుకోవడంలో తెలంగాణ సమాజం దారుణమైన పరాభవాన్ని రుచి చూస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం సాకారమైతే ప్రజల జీవితాలు గణనీయంగా పురోభివృద్ధి సాధిస్తామని నమ్మబలికిన నాయకత్వమే గత ఎనిమిది సంవత్సరాలుగా అధికారంలో కూర్చుండి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని ఆయన దుయ్యబడ్డారు .అపారమైన సహజ వనరులు, బహుళ ఆదాయ మార్గాలు, మిగులు బడ్జెట్ తో తుల తూగిన తెలంగాణ ఖజానా నేడు కెసిఆర్ ప్రభుత్వ పాలనవిధానాలతో ఖాళీ అయిందని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని దుస్థితి కి వచ్చిందని , టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆయన విమర్శించారు . కెసిఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు , అనాలోచిత నిర్ణయాలకు తెలంగాణ ప్రజానీకం బలవుతున్నారని, అన్ని విధాల టాక్స్ లను విపరీతంగా పెంచి సామాన్య , మధ్యతరగతి ప్రజల నుండి వసూలు చేస్తూ ప్రభుత్వ అప్పులకు వడ్డీలు కడుతుందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ప్రజల ఆస్తులను ప్రభుత్వ భూములను కూడా తెగ నమ్మి రాష్ట్రాన్ని నడిపిస్తున్న ఘన చరిత్ర టిఆర్ఎస్ కె దక్కుతుందని ఆయన ఎద్దేవా చేశారు.8 ఏళ్ల పాలనలో కెసిఆర్ ప్రభుత్వం చేసిన,చేస్తున్న అభివృద్ధిని తెలంగాణ సమాజం గ్రహించిందని, అనవసరంగా కేంద్రం పై విషం కక్కడం మానుకోవాలని ఆయన ఈ సందర్భంగా హితవు పలికారు.
Share this on your social network: