పట్టణ అభివృద్ధే ప్రథమ లక్ష్యం

Published: Tuesday October 05, 2021
మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్
వికారాబాద్ బ్యూరో 04 అక్టోబర్ ప్రజాపాలన : పట్టణ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ అన్నారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు కౌన్సిలర్ పల్గుట్ట ప్రవళిక క్రిష్ణ ఆధ్వర్యంలో కొత్రేపల్లి గ్రామంలోని కొత్తకాలనీలో సైడ్ డ్రైనీజీ నిర్మాణానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలో ఏ సమస్య ఉన్న వెంటనే నా దృష్టికి తేవాలని సూచించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి పనులను అంచెలంచెలుగా చేపడుతున్నామని స్పష్టం చేశారు. పలు వార్డులలో సిసి రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని గుర్తు చేశారు. 5వ వార్డు కౌన్సిలర్ పల్గుట్ట ప్రవళిక క్రిష్ణ మాట్లాడుతూ..3 లక్షల మున్సిపల్ అభివృద్ధి నిధులతో సైడ్ డ్రైనేజీ నిర్మాణాన్ని కొత్తకాలనీలో మొట్టమొదటి పనిని చేపడుతున్నామని వివరించారు. జంగని హనుమంతు ఇంటి నుండి మేన్ రోడ్డు వరకు 76 మీటర్ల పొడవు సైడ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టనున్నామని అన్నారు. కాంట్రాక్టర్ చింతకింది ప్రశాంత్ ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్ చిట్యాల అనంత్ రెడ్డి, మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ అఫ్జల్ పాష (షకీల్), మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.