రెండు జాతీయపార్టీల్లో నాయకులు లేరా..? పొంగులేటిపై ఎమ్మెల్యే సండ్రా ఘాటువ్యాఖ్యలు..

Published: Wednesday April 19, 2023
 తల్లాడ, ఏప్రిల్ 18 (ప్రజాపాలన న్యూస్): 
జిల్లాలో నీ అంతట నీవు అభ్యర్థులను ప్రకటించావు.. నాకోసం జాతీయపార్టీలు ఎదురు చూస్తున్నయంటున్నావ్.. ఏం..ఆ పార్టీల్లో నాయకులు లేరా..? వారు నీ అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తారా..? ఒకవేళ మద్దతిస్తే ఆ పార్టీల విధానం ఏంటో ప్రజలు గమనిస్తున్నారని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య మాజీ ఎంపీ పొంగులేటికి చురకలంటించారు. మంగళవారం ఖమ్మంజిల్లా తల్లాడలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర  పైవిధంగా స్పందించారు. ప్రభుత్వం ద్వారా లబ్ధిపొంది ఆర్థికంగా అభివృద్ధి సాధించి, చివరకు ఆ ఎమ్మెల్యేలను అసెంబ్లీ మెట్టు తాకనివ్వనని మాట్లాడటం శోచనీయమన్నారు. కాంట్రాక్టర్ కాకముందు నీ పరిస్థితి ఏంటో.. ప్రస్తుతం నీ పరిస్థితి ఏంటో ప్రజలకు తెలుసని, తండ్రి లాంటి కెసిఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం తగదన్నారు. జిల్లాలో అభివృద్ధిపై నీ ముద్ర ఏమిటని.. నీవు ఏ కార్యక్రమాలు చేశావని, నీకు ప్రజలు ఎలా ఓట్లు వేస్తారని ప్రశ్నించారు. నువ్వు ఏ పార్టీలోకి పోతున్నావని చెప్పకుండా.. నీ రాజకీయ విధానం తెలియకుండా ఇలా దిగజారుడు మాటలు మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారన్నారు. డబ్బు, ధన బలంతో  అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తూ తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని, నిరంతరం అభివృద్ధికి పాటుపడుతున్న ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ప్రజలు ఊరుకోరని సండ్ర పొంగులేటిపై ఘాటుగా హెచ్చరికలు జారీచేశారు.